కొమురంభీ ఆసిఫాబాద్ : బయటి ప్రపంచంతో సంబంధాల మాటేమో గానీ ఆపదొస్తే ప్రాణాలు నిలుపుకోవడానికి, కనీస అవసరాలు అందుకునేందుకు ఆ గిరిజనులు పడే పాట్లకు ఇక చెల్లుచీటి. మెడికల్ ఎమర్జెన్సీ అయితే వైద్యం చేయించడానికి మంచాన్ని తిరగలేసి దానిపై రోగిని పడుకోబెట్టి శ్రమకోర్చి మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లడం, రేషన్ సరుకులకు నాలుగు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేయాల్సి రావడం వంటి గిరిజనుల బాధలకు ఆసిఫాబాద్ పోలీసులు స్వస్తి పలికారు. ఆటోలు, వాహనాల ప్రయాణ రాకపోకలకు అనువుగా 9.5 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించారు.
మావోయిస్టు ప్రభావిత లింగాపూర్ మండలంలోని లెండిగూడ – చోరుపల్లి మధ్య, పుణగుడ నుండి చోరుపల్లి వరకు దశాబ్దాల గిరిజనుల సమస్యను దూరం చేస్తూ వారి కలను సాకారం చేసేలా రహదారిని నిర్మించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సవాలును పరిష్కరించేందుకు పోలీసులు ముందుకు వచ్చారు.
ఏఎస్పీ సుదీద్రతో కలిసి ఇన్ఛార్జీ ఎస్పీ వై సత్యనారాయణ ఈ రహదారిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ సత్యనారాయణ తన ప్రసంగాన్ని గోండు భాషలో ప్రారంభించి స్థానికులను ఆకట్టుకున్నారు. స్థానిక పోలీసు అధికారుల ద్వారా గిరిజనుల దయనీయమైన దుస్థితిని తెలుసుకున్నట్లు చెప్పారు. కుగ్రామాల తాగునీటి సంక్షోభాన్ని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జైనూర్ ఇన్స్పెక్టర్ హనూక్, లింగాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ మధుకర్ కేవలం ఒక నెల వ్యవధిలోనే రహదారిని ఏర్పాటు చేయడానికి తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. స్థానికులు స్వచ్ఛందంగా 800 ట్రిప్పుల కంకర, 20 ట్రిప్పుల చిప్స్ ను సహాయంగా అందించినట్లు తెలిపారు.
600 జనాభా కలిగిన లెండిగూడ గ్రామ పెద్ద గోవింద్ మాట్లాడుతూ గిరిజనుల దయనీయ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కాగా ఇప్పుడు ఆటో రిక్షాను అద్దెకు తీసుకోవడం ద్వారా లేదా మోటారుసైకిల్ ద్వారా సులభంగా చోర్పల్లి గ్రామానికి ప్రయాణించవచ్చని తెలిపారు. అనంతరం ఎస్పీ స్థానిక యువతకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రిపరేషన్ నిమిత్తం స్టడీ మెటీరియల్, యువకులకు వాలీబాల్ కిట్లు, బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) ఆసిఫాబాద్ డీఎస్పీ అచేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.