బీజింగ్ : భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో నిజమైన విలన్కు ఫలితం దక్కింది. ఘర్షణకు మూలకారకుడైన జనరల్ జావో జోంగ్కికి జిన్పింగ్ ప్రభుత్వం ముఖ్యమైన స్థానాన్ని కల్పించింది. పీఎల్ఎకు చెందిన ఈ మాజీ టాప్ కమాండర్ను చైనా పార్లమెంట్ (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్-ఎన్పీసీ) ప్రభావవంతమైన విదేశీ వ్యవహారాల కమిటీకి డిప్యూటీ చైర్మన్గా నియమించారు. జనరల్ జావో రెండు దశాబ్దాలుగా భారత్తో టిబెట్ సరిహద్దు వెంబడి విధుల్లో ఉన్నారు. 65 ఏండ్ల వయసున్న జనరల్ జావో జోంగ్కి 2017 లో డోక్లాం ఘర్షణ సమయంలో వెస్ట్రన్ కమాండ్కు అధిపతిగా, 2020 లో లడఖ్ స్టాండఫ్లో ఉన్నారు.
పీఎల్ఏ నిబంధనల ప్రకారం, సైన్యం యొక్క టాప్ జనరల్ పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. జనరల్ జావో నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు మార్చి 5 నుంచి జరుగనున్న ఎన్పీసీ వార్షిక సమావేశానికి ముందు అమలులోకి వచ్చాయి. ఎన్పీసీ, దాని సలహా సంస్థ అయిన చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) సంవత్సరానికి ఒకసారి సమావేశమవుతాయి. గల్వాన్ లోయలో దాడి చేయాలని చైనా సైన్యాన్ని ఆదేశించినది జనరల్ జావో కావడం విశేషం. జనరల్ జావో జోంగ్కి ఇప్పటికే భారత్తో గతంలో చాలా ఘర్షణలకు దిగిన ఆనవాళ్లు ఉన్నాయి. జావోతో పాటు ఇప్పటివరకు సాయుధ పోలీసు దళాలకు అధిపతిగా ఉన్న జనరల్ వాంగ్ నింగ్.. రాజ్యాంగం, చట్టంపై ఎన్పీసీ కమిటీకి డిప్యూటీ చైర్మన్గా నియమితులయ్యారు. గల్వాన్లో చైనాతో జరిగిన ఘర్షణలో భారతదేశానికి చెందిన 20 మంది సైనికులు హత్యకు గురవగా,, చైనాకు చెందిన 40 మంది సైనికులు చనిపోయారని అమెరికా పత్రికలు పేర్కొన్నాయి.