ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్
కింగ్ కోఠి దవాఖానకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సినీ నటుడు అడవి శేషు
పది స్ట్రెచర్ ట్రాలీలను ఉస్మానియా దవాఖానకు అందించిన ప్రైవేటు ఉద్యోగిని శ్రీలత శరవరి
సుల్తాన్బజార్, మే 6: కరోనా మహమ్మారి నేపథ్యంలో దవాఖానలకు తమ వంతు సహాయంగా విరాళాలు అందించడం అభినందనీయమని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రైవేటు ఉద్యోగిని శ్రీలత శరవరి పది స్ట్రెచర్ ట్రాలీలను రోగుల సహాయార్థం ఉస్మానియా దవాఖానకు గురువారం విరాళంగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానలలోని రోగుల సౌకర్యార్థం ప్రైవేట్ ఉద్యోగిని తన వంతు సహాయంగా స్ట్రెచర్ ట్రాలీలను అందించడం పట్ల ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దవాఖాన డిప్యూటీ సీఎన్ ఆర్ఎంవో డాక్టర్ సాయిశోభ, డాక్టర్ బండారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ రోగులకు వైద్య సేవలందిస్తున్న కింగ్ కోఠి కొవిడ్ దవాఖానకు సినీ నటుడు అడవి శేషు తన వంతు సహాయంగా దవాఖానాలో చికిత్స పొందుతున్న రోగుల సౌకర్యార్థం మంచినీటి ఆర్వో ప్లాంట్ను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా కొవిడ్ కో ఆర్డినేటర్ డాక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న కింగ్కోఠి దవాఖానకు ఆర్వో ప్లాంట్ను విరాళంగా అందజేసినందుకు సినీ నటుడు అడివి శేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.