వీరు తయారు చేసే పాత్రలకు డిమాండ్
ప్లాస్టిక్ పోటీలోనూ మక్కువతో తయారీ
ఆదాయం లేకున్నా ఆగని ‘చక్రం’
ఆదరణ తగ్గినా ఓర్పు, నేర్పుతో పని
పెండ్లి నుంచి చావు దాకా కుండల వినియోగం
సంపూర్ణ ఆరోగ్యానికీ మట్టి పాత్రలే మేలు
కోటపల్లి, మార్చి 13:చెమట చుక్కలను చిందించి, మట్టి పాత్రలను తయారు చేస్తున్నారు కుమ్మరులు. కులవృత్తినే నమ్ముకొని, వివిధ రూపాల్లో ఆకట్టుకునే విధంగా పాత్రలు తీర్చిదిద్దుతూ ఉపాధి పొందుతున్నారు. ప్లాస్టిక్ ప్రపంచంలోనూ పోటీ పడుతూ.. మార్కెట్లో రాణిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో కుమ్మరులు ఓర్పు, నేర్పుతో తయారు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇప్పటికీ పెండ్లి నుంచి చావు దాకా ఏ కార్యమైనా కుమ్మరుల కుండలకు డిమాండ్ తగ్గలేదు. సంపూర్ణ ఆరోగ్యానికి మట్టి పాత్రలు ఉపయోగపడుతుండడంతో ఇక్కడ తయారవుతున్న కుండలు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి.
చావు నుంచి పెళ్లి దాకా ప్రతి కార్యానికి ఉపయోగించే కుమ్మరి కుండలకు కేరాఫ్గా కోటపల్లి మండలం మారింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని వెలమపల్లి, షట్పల్లి, వెంచపల్లి, నందరాంపల్లి, సిర్స, రాంపూర్ గ్రామాల్లో కుమ్మరి కుటుంబాలు ఉండగా, జిల్లా అంతటికీ ఈ కుండలను, మట్టి పాత్రలను తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. మారుమూల మండలమైన కోటపల్లిలో తయారు చేసిన కుండలు చెన్నూర్, మంచిర్యాల, గోదావరిఖని వంటి పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మండలంలో దాదాపు 60 కుటుంబాలు ఈ కుండల తయారీపైనే ఉపాధి పొందుతున్నాయి. ఒక్కరు రోజుకు 18 నుంచి 20 కుండలు తయారు చేస్తుండగా, వీటిని వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కుండలతో పాటు రంజన్లు, దీపాలు, బుడిగెలు, కిడ్డీబ్యాంక్, తదితర వస్తువులు వీరు తయారు చేస్తుంటారు.
మట్టి కుండలను వినియోగించాలి?
మట్టి కుండలు, పాత్రలను వినియోగించడం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తున్నది. స్టీల్, అల్యూమీనియంకు ఇస్తున్న ప్రాధాన్యం మట్టి పాత్రలకు, కుండలకు ఇవ్వకపోవడం బాధాకరం. ఎంతో శ్రమ పడి మట్టి పాత్రలను, కుండలను తయారు చేస్తుండగా, సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడాల్సి వస్తోం ది. మేం ఎంతగానో కష్టపడి తయారు చేసిన కుండలు మా వద్ద రూ.20 నుంచి 30 వరకు ధర మాత్రమే పలుకుతున్నది. ఇవీ పట్టణాల్లో రూ.100 నుంచి రూ. 150 వరకు పలకడం వల్ల నష్టపోవాల్సి వస్తోంది.
-కుందారపు మల్లయ్య, వెలమపల్లి
మట్టి కుండలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి
కుమ్మరులు తయారు చేసే మట్టి కుండలు, మట్టి పాత్రలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మా చిన్నప్పటి నుంచి మట్టి పాత్రల్లో వండుకొని మట్టి కుండల్లో నీరు తాగినవాళ్లమే. పల్లెల్లో మట్టి పాత్రల వినియోగం తగ్గుతుండగా, పట్టణాల్లో ఇటీవల కొంత పెరుగుతు న్నది. ఆరోగ్యంపై దృష్టి పెట్టడంలో భాగంగా ప్రస్తుతం మట్టి పాత్రలపై మక్కువ చూపుతున్నారు. మట్టి పాత్రలు, కుండల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉన్నందున ప్రతి ఒక్కరూ వినియోగించేందుకు సిద్ధమవుతు న్నారు. ఈకోణంలోనే కాకుండా కుమ్మరి వృత్తిని కాపాడుకోవా ల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
-లక్ష్మీబాయి, వెలమపల్లి
ప్రతి పనికీ కుండ
స్టీల్, ప్లాస్టిక్ వినియోగంలోకి రాకముందు ప్రతి పనికి కుమ్మరి కుండలనే ఉపయోగించేవారు. పెండ్లి నుంచి మొదలుకుంటే చావు వరకు కుండల పాత్ర ఎంతో కీలకం. పెండ్లిలో అయిరెండ్లు, చావు సమయంలో అంత్యక్రియలకు కుండలను వాడుతుంటారు. కాలం మారుతున్నా, వీటి స్థానంలో కొత్తవి రాకపోవడం విశేషం. ఫ్రిజ్లు లేని కాలంలో ప్రతి ఇంట్లో మట్టి కుండలోని నీటినే తాగేవారు. మట్టి కుండలోని నీరు సహజంగా చల్లగా అవ్వడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. మట్టి పాత్రల్లో వండిన ఆహారం రుచికరంగా ఉండడంతో పాటు పాడుకాకుండా ఉంటుందని పూర్వీకులు చెబుతుంటారు. వీటితో పాటు గౌడ కులస్తులు ఈత, తాటి చెట్ల నుంచి కల్లు తీయడానికి కుమ్మరులు తయారు చేసిన కుండలను వాడుతారు. కుమ్మరి కుండలోని నీటికి, కల్లుకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.
కుండలను తయారు చేసే విధానం..
ఎండాకాలం స్థానిక చెరువుల నుంచి మేలురకమైన మట్టిని కుమ్మరులు సేకరిస్తుంటారు. ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు, చెత్త లేకుండా చేసి ప్రత్యేకంగా ఒకచోట నిల్వచేసి ఉంచుతారు. కుండల తయారీకి ఒకరోజు ముందుగా మట్టిని నానబెట్టి, కుండలను కాల్చిన సమయంలో మిగిలిన బూడిద, మట్టిని మరుసటి రోజు అందులో తొక్కుతారు. మిశ్రమాన్ని ముద్దలుగా తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన మట్టిని కుమ్మరి సారె మీద ఉంచి కుండలను తయారు చేస్తుంటారు. ఇలా తయారు చేసిన కుండలను వారం రోజుల పాటు ఆరబెట్టి, బట్టిలో కాలబెట్టిన తర్వాత విక్రయాలకు పంపుతారు.