హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): కరోనాతోపాటు డీజిల్ ధరలు పెరగటంతో ఆర్టీసి పరిస్థితి మూలిగే నకపై తాటి పండు పడ్డట్టు తయారైందని, ఇటువంటి కష్టకాలంలో చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని రోడ్డు రవాణా సంస్థ అధికారులు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు విన్నవించారు. మరోవైపు కొవిడ్ మహమ్మారి వల్ల విద్యుత్తు సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయని.. గత ఆరేండ్లుగా చార్జీలు పెంచలేదని విద్యుత్తు అధికారులు విన్నవించారు. చార్జీలు పెంచడానికి అనుమతించాలని కోరారు. ఆర్టీసీని ఆర్థిక సంక్షోభం నుంచి ఆదుకోవాలని రవాణాశాఖ మంత్రి సహా ఆర్టీసీ చైర్మన్, ఎండీ, ఉన్నతాధికారులు విన్నవించారు. ఆర్టీసీ పరిస్థితిపై మంగళవారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఆర్టీసీని పటిష్ఠ పరిచేందుకు రెండేండ్ల క్రితం చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న సంస్థను తిరిగి పట్టాలపైకి ఎకించే ప్రయత్నం ప్రారంభమైందని, గాడిలో పడుతున్నదనుకొంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకొనేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
డీజిల్ ధరలతో 550 కోట్ల అదనపు భారం
గత ఏడాదిన్నర కాలంలో డీజిల్ ధరలు లీటర్కు రూ.22 మేర పెరగటంతో ఆర్టీసీపై రూ.550 కోట్లు అదనపు ఆర్థికభారం పడుతున్నదని అధికారులు సీఎంకు వివరించారు. డీజిల్తోపాటు టైర్లు, ట్యూబులు తదితర బస్సు విడిభాగాల ధరలు పెరగటం కూడా సంస్థను నష్టాల్లోకి నెట్టిందని చెప్పారు. మొత్తంగా ఏడాదికి రూ.600 కోట్ల ఆర్థిక భారాన్ని ఆర్టీసీ మోయవలసి వస్తున్నదని విన్నవించారు.
లాక్డౌన్లో కోల్పోయిన ఆదాయం రూ.3 వేల కోట్లు
కరోనా లాక్డౌన్తో ఆర్టీసీ దాదాపు రూ.3 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. హైదరాబాద్ పరిధిలోనే నెలకు రూ.90 కోట్ల వరకు నష్టం వస్తున్నదని వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు. ఇటువంటి కష్టకాలంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించారు. 2020 మార్చిలోనే అసెంబ్లీలో ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచుతామని ప్రకటించిందని, కరోనా కారణంగా చార్జీలను పెంచలేదని ఈ సందర్భంగా వారు సీఎంకు గుర్తుచేశారు. ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతూనే ఆర్టీసీని పటిష్ఠపరిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటూ వస్తున్నదని, ఇంకా ప్రభుత్వం మీదనే అదనపు భారం మోపాలనడానికి తమకు మాటలు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. చార్జీలు పెంచుకోవడానికి తమకు అనుమతిస్తే తప్ప.. ఆర్టీసీ మనుగడ సాధ్యంకాదన్నారు. నష్టాల్లోంచి బయటపడేందుకు చార్జీలు పెంచడంతోపాటు ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకోవాల్సి ఉన్నదని తెలిపారు.
ఆర్టీసీ మనుగడకు అన్ని చర్యలు
ఆర్టీసీని నిలబెట్టుకొనేందుకు ప్రభు త్వం అన్ని చర్యలు చేపడుతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అటు ఆర్టీసీతోపాటు విద్యుత్తు అంశాలకు సంబంధించి రాబోయే క్యాబినెట్లో చర్చించి, తగు నిర్ణయం తీసుకొంటామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాబోయే క్యాబినెట్ సమావేశానికి తీసుకురావాలని రవాణా, విద్యుత్తు శాఖల మంత్రులను, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సమావేశంలో మంత్రులు కే తారకరామారావు, పువ్వాడ అజయ్కుమార్, జీ జగదీశ్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, సైదిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్రావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్శర్మ, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, జెన్కో అండ్ ట్రాన్స్కో సీఎండీ డీ ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్తు సంస్థలదీ అదే పరిస్థితి..
ఇదే సందర్భంలో.. రాష్ట్రంలో విద్యుత్తు అంశంపై ఆ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్రావు.. సీఎం కేసీఆర్తో చర్చించారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాల మాదిరిగానే విద్యుత్తు సంస్థలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని విన్నవించారు. ఆరేండ్లుగా విద్యుత్ చార్జీలను సవరించలేదని, విద్యుత్శాఖను గట్టెకించడానికి చార్జీలు పెంచాలని కోరారు.