మంచిర్యాల టౌన్, మే 15 : కరోనా బాధితులకు అండగా నిలిచి ఔదార్యాన్ని చాటుకొంటున్నారు మంత్రి కేటీఆర్. విశ్వబ్రాహ్మణ సంఘం మంచిర్యాల మండల అధ్యక్షుడు రావుల రమేశ్చారి అక్క రాజమణి కరోనాతో హైదరాబాద్ బోడుప్పల్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. రమేశ్చారి బావ వేణుగోపాల్రావు ఈ నెల 6న కరోనాతో మృతిచెందాడు. కాగా, ప్రస్తుతం రాజమణి పరిస్థితి విషమంగా ఉన్నదని.. సోషల్ మీడియా వేదికగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు కావాలని వేడుకున్నారు. గమనించిన నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్రావు ఆ కుటుంబానికి సాయం అందించాలని మంత్రి కేటీఆర్ను కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి, తన కార్యాలయంలో రమేశ్చారి అక్కకు కావాల్సిన ఇంజెక్షన్లను అందజేసేలా చర్యలు తీసుకున్నారు. తమ విన్నపాన్ని మన్నించిన మంత్రి కేటీఆర్కు, విజిత్రావుకు రమేశ్చారి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.