ముంబై: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటం, వ్యాక్సినేషన్ వేగం పెరుగుతుండటం మార్కెట్లకు కలిసి వస్తోంది. చరిత్రలో తొలిసారి మంగళవారం సెన్సెక్స్ 53 వేల మార్క్ను అందుకోవడం విశేషం. ఇక అంతర్జాతీయ సానుకూలతల వల్ల కూడా మన మార్కెట్లు జోరు మీదున్నాయి. మంగళవారం ఉదయం 9.46 గంటల సమయంలో సెన్సెక్స్ 53003 పాయింట్ల మార్క్ను అందుకుంది.
అటు నిఫ్టీ కూడా 0.84 శాతం లాభపడి 15884 పాయింట్లకు చేరింది. సోమవారం ఇండియా రికార్డు స్థాయిలో 86 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చింది. అంతేకాదు కేసులు కూడా మూడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ఇవన్నీ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి.