సిటీబ్యూరో, జూలై 6(నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా ఏర్పాటైన హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పట్టణ ప్రాంతంలో పచ్చదనం పెంపొందించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. పార్కులు, రోడ్లు, ఖాళీ స్థలాలు మాత్రమే కాదు, ఇళ్లల్లోనూ పెంచుకునేందుకు మొక్కలను పెంచి వాటిని పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నగరం నడి బొడ్డు న ఉన్న హుస్సేన్సాగర్ తీర ప్రాంతంలోని సంజీవయ్య పార్కు ఎదురుగా ఎకరానికి పైగా ఉన్న స్థలంలో ప్రత్యేకంగా నర్సరీ ఏర్పాటు చేసింది.
ఈ నర్సరీలో ఎదిగిన మొ క్కలను కేవలం నగర వాసులకు పంపిణీ చేయనున్నారు. ప్రధానంగా పూల మొక్కలైన జాస్మిన్, ఆక్సిజన్ ఇచ్చే ఫ్లో రోసెంట్, స్నేక్ ప్లాంట్స్, ఫ్లవరింగ్, తులసీ, మస్కిటో రెపిలెంట్, లెమన్ గ్రాస్ వంటివి ఈ నర్సరీలో పెంచుతున్నారు. నగరంలో తీవ్రం గా ఉన్న దోమల బెడద నుంచి తప్పించేందుకు ప్రత్యేకంగా కొన్ని రకాల మొక్కలను ఎంపిక చేసి, వాటిని ఇక్కడ పెంచుతున్నారు. ఇందులో రకరకాల తులసి మొక్కలతో పాటు మస్కిటో రెపిలెంట్లు ఇక్కడ పెంచుతున్నామని హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు తెలిపారు. ఈ నర్సీరీలో సుమారు 10 లక్షల మొక్కలను పెంచి, వాటిని నగరవాసులకు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించారు. నగరంలోని పార్కులు, రోడ్లే కాదు ఇళ్లల్లోనూ పచ్చదనం, ఆరోగ్యాన్నిచ్చే మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనిస్తూ హెచ్ఎండీఏ అర్బన్ నర్సరీలను నిర్వహిస్తోంది.