రూ.56.77 కోట్లు విడుదల చేస్తూ సర్కారు ఉత్తర్వులు
సీఎం, మంత్రికి కృతజ్ఞతలు: నాయికోటి రాజు
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రేషన్ డీలర్ల కమీషన్ బకాయిలు రూ.56.77 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు రేషన్ డీలర్ల కమీషన్ బకాయిల విడుదల, ఇతర సమస్యలపై పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బకాయిలు విడుదల చేసినట్టు తెలిపారు. కరోనా విపత్తులోనూ రేషన్ డీలర్ల బకాయిలు విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. కరోనా కష్టకాలంలో పేదలు ఆకలితో అలమటించకుండా ప్రభుత్వం ఏడాదికాలంగా అన్నిచర్యలూ తీసుకుంటున్నదని చెప్పారు. పేదలకు బియ్యం పంపిణీలో డీలర్లు కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. రేషన్ డీలర్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కోసం కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. డీలర్ల ఖాళీలను త్వరలోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రస్తుతం చేపట్టిన ఉచిత బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని మంత్రి రేషన్ డీలర్లను కోరారు. జూన్, జూలై నెలలకుగానూ ప్రతిఒక్కరికీ 20 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 5 నుంచి అన్ని రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వం డీలర్లకు సంపూర్ణ సహకారం అందజేస్తుందని పేర్కొన్నారు. కమీషన్ బకాయిల విడుదల చేయడంపై సీఎం కేసీఆర్కు, మంత్రి గంగుల కమలాకర్కు రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు కృతకజ్ఞతలు తెలిపారు. కరోనాతో చనిపోయిన రేషన్ డీలర్లకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఎలాంటి షరతులు లేకుండా వారి కుటుంబంలోని వారికి డీలర్షిప్ ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తిచేశారు.