హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని ఏపీ సర్కారుకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పరిధిలోని స్వతంత్ర రివర్వ్యాలీ అండ్ హైడ్రాలిక్ ప్రాజెక్టుల ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ(ఈఏసీ) స్పష్టం చేసింది. దరఖాస్తును తిరస్కరించిన ఈఏసీ.. ప్రాజెక్టు నివేదికలన్నీ అసమగ్రంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తంచేసింది. పాత ప్రాజెక్టులకు నీళ్లివ్వడానికే కొత్త ఎత్తిపోతలు చేపడుతున్నామని, దీనికి కొత్తగా అనుమతులు అవసరం లేదన్న ఏపీ వాదనను తప్పుబట్టింది. అనుమతులు తప్పనిసరి అని తేల్చిచెప్పింది. ప్రాజెక్టు పనులపై తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకున్నది. ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు అందించాలని ఏపీ సర్కారుకు స్పష్టంచేసింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై ఈఏసీ పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా ఈ నెల 7న జరిగిన 14వ ఈఏసీ వర్చువల్ సమావేశంలో మరోసారి చర్చలు జరిగాయి. ఆ మీటింగ్కు సంబంధించిన మినిట్స్ను ఈఏసీ తాజాగా వెల్లడించింది.
శ్రీశైలం చుట్టుపక్కల ప్రాంతాలపై ఎఫెక్ట్
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 800 అడుగుల మట్టం నుంచే నీటిని లిఫ్ట్ చేసే విధంగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అప్రోచ్ చానల్ను రూపొందించారని, దాన్ని అదే రిజర్వాయర్ నుంచి 854 అడుగుల ద్వారా గ్రావిటీపై నీటిని తరలించే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీకి అనుసంధానించారని, ఒకే రిజర్వాయర్ నుంచి వేర్వేరు లెవల్స్తో ఒకే ప్రాంతానికి నీటిని తరలిస్తే రిజర్వాయర్ చుట్టపక్కల ప్రాంతాలు పొడిబారిపోతాయని ఈఏసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా వెళ్లే అప్రోచ్చానల్కు నీటిని అదనంగా అందించటమే లక్ష్యంగా ప్రాజెక్టును చేపట్టారని, నీటిని అదనంగా అందించేందుకు బేసిన్లోని రాష్ర్టాలు అనుమతిస్తే కొత్తగా ప్రాజెక్టును చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది.
తెలంగాణ అభ్యంతరాల మాటేమిటి?
ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు, ఆందోళనను వ్యక్తం చేసిందని ఏపీకి వివరించిన ఈఏసీ.. తెలంగాణ అభ్యంతరాల మాటేమిటని ప్రశ్నించింది. అధికమొత్తంలో నీటిని మళ్లించేందుకు ఏపీ సర్కారు రాయలసీమ ప్రాజెక్టును చేపట్టిందని, దాని ద్వారా తమ ప్రాజెక్టులకు నీళ్లు లేకుండా పోతాయని, పర్యావరణంపై కూడా తీవ్రప్రభావం పడనున్నదని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తున్నదని వివరించింది. పౌరసమాజం నుంచీ ఫిర్యాదులు అందాయని ఈఏసీ వివరించింది. ఈ సమస్యలను ఎన్జీటీ మార్గదర్శనంలో కేంద్ర జలసంఘం, కేఆర్ఎంబీ పరిష్కరించాల్సిన అవసరముందని తెలిపింది. ఏపీ వాదనలన్నింటినీ ఈఏసీ తోసిపుచ్చింది.
నీటి లభ్యత వివరాలివ్వాల్సిందే
కృష్ణానదిలో నీటి లభ్యతకు సంబంధించి సంపూర్ణ నివేదికను, నదిపై ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులు వివరాలను అందించాలని తెలిపింది. హైడ్రోపవర్ ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లను సమర్పించాలని ఆదేశించింది. కొత్త ఎత్తిపోతల నిర్మాణం తర్వాత పడే ప్రభావాన్ని అంచనా వేసి, ఆ రిపోర్టును అందివ్వాలని ఏపీకి స్పష్టంచేసింది. ప్రాజెక్టు నిర్మాణంతో ఏదైనా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, రిజర్వ్ ఫారెస్ట్, ఇతర ఎకోలాజికల్ ప్రాంతాలపై పడే ప్రభావ అంచనా నివేదికను అందజేయాలని ఆదేశించింది.