సుల్తాన్బజార్, మే 24: కరోనా ఒక ఎత్తు.. సరైన చికిత్సే లేని బ్లాక్ఫంగస్ ఒక ఎత్తు. కరోనా విడిచిపెట్టినా బ్లాక్ఫంగస్ మాత్రం కొందరిని వదలట్లేదు. బ్లాక్ఫంగస్ బారిన పడుతున్న వారికి హైదరాబాద్ కోఠిలోని ఈఎన్టీ దవాఖాన సంజీవనిలా నిలుస్తున్నది. ఫంగస్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఇక్కడి వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బ్లాక్ఫంగస్ కేసులు భారీగా నమోదయ్యే ప్రమాదం ఉందని ముందే ఆలోచించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. కోఠి ఈఎన్టీ దవాఖానను బ్లాక్ఫంగస్ వ్యాధికి నోడల్ దవాఖానగా ప్రకటించారు. అప్పట్నుంచి బాధిత రోగులను అక్కున చేర్చుకొంటున్న అక్కడి డాక్టర్లు.. కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పరిస్థితిని బట్టి సరైన మందులు ఇస్తూ, అవసరమైతే శస్త్రచికిత్స చేస్తూ బాధితులను ఫంగస్ విముక్తులను చేస్తున్నారు. సోమవారమే ఇద్దరు రోగులు ఫంగస్బారినుంచి కోలుకొని హైదర్నగర్కు చెందిన వాసుదేవరావు, వనపర్తికి చెందిన చిట్టెమ్మ డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా వాళ్లు ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ఈఎన్టీ డాక్టర్లు కనిపించే దేవుళ్లు అని కొనియాడారు.
ప్రతి డాక్టర్కు కృతజ్ఞతలు
కరోనా నుంచి కోలుకుంటున్న దశలో బ్లాక్ఫంగస్ బారిన పడ్డాను. ప్రైవేటు దవాఖానకు వెళ్తే మందులు తెచ్చుకొంటే, సర్జరీ చేస్తామని అన్నారు. ఆ మాటతో షాకయ్యా. ఫంగస్కు ఈఎన్టీ దవాఖాన నోడల్ కేంద్రంగా ఉందని తెలుసుకొని 8 రోజుల కిందట ఈ దవాఖానలో చేరాను. సర్జరీ చేసే సమయానికి ఇంజెక్షన్లు, మందులు ఇచ్చారు. నేను కోలుకోవడానికి సహకరించిన ప్రతి వైద్యుడికి ప్రత్యేక కృతజ్ఞతలు.
డాక్టర్ల వల్లే త్వరగా కోలుకొన్నా
ఏ జబ్బు సోకిందో తెల్వదు. కండ్ల మంటలు పుట్టాయి. మసకబారి మూసుకుపోయాయి. ఏం జరుగుతుందో తెలుసుకొనేలోపు బ్లాక్ఫంగస్ అని చెప్పిన డాక్టర్లు.. ఈఎన్టీకి పొమ్మని చెప్పారు. నా పరిస్థితిని చూసిన డాక్టర్లు సర్జరీ చేశారు. ప్రతిరోజు మూడుసార్లు మందులు, ఇంజెక్షన్లు ఇచ్చి బాగా చూసుకొన్నారు. వాళ్లవల్లే త్వరగా కోలుకొన్నా. అందుకే డాక్టర్లను వైద్యోనారాయణో హరిః అంటారు.
అందరికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం
బ్లాక్ఫంగస్ బారిన పడినవారిని మొదటిదశలో గుర్తిస్తే ఎలాంటి అపాయం ఉండదు. ఈఎన్టీకి వచ్చిన ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. డాక్టర్లు నిత్యం రోగి పర్యవేక్షణలోనే ఉంటున్నారు. సమయానికి మందులు, ఇంజక్షన్లు ఇస్తున్నాం. దవాఖానలో చికిత్స పొంది కోలుకొన్న రోగులు మూడు వారాల పాటు కచ్చితంగా యాంటిఫంగల్ మందులను వాడాలి. రోజుకు రెండుసార్లు ఆవిరిపట్టాలి.