హైదరాబాద్, జూన్ 24 ( నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో లావాదేవీలను సులభతరం చేసేందుకు మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్ల సమయంలో బయోమెట్రిక్, ఐఆర్ఐఎస్ విఫలమైతే ఓటీపీ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయనున్నారు. అమ్మకందారు, కొనుగోలుదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ పంపనున్నారు. మరోవైపు, పోర్టల్ ప్రారంభమైన తర్వాత గతేడాది నవంబర్ 2వ తేదీ నుంచి ఇప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లలో తప్పొప్పులను సవరించేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం సిటిజన్ లాగిన్లో ‘రాటిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్’ అనే ఆప్షన్ను ఇచ్చారు. ఎన్నారై మాడ్యూల్లోనూ పలు మార్పులు చేశారు. కంపెనీలు జీపీఏతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. వీటితోపాటు ఎమ్మార్వో, కలెక్టర్ లాగిన్లో మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు క్యాటగిరీలవారీగా ఉన్నతాధికారులకు కనిపించనున్నాయి.