హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తరభాగం నిర్మాణం చేపట్టడానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. పూర్తిగా జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్మించే రింగ్రోడ్డ అలైన్మెంట్, డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. అలైన్మెంట్ రూపొందించే పనులను దక్కించుకున్న కే అండ్ జే లిమిటెడ్ సంస్థ క్షేత్రస్థాయిలో ఈ పనులను చేపట్టింది. దాదాపు రెండునెలల్లో అలైన్మెంట్ ప్రక్రియ పూర్తిచేసేలా పనులను మొదలుపెట్టింది. అలైన్మెంట్తోపాటుగా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను కూడా తయారుచేయనున్నారు. అలైన్మెంట్ను, డీపీఆర్ను ఎన్హెచ్ఏఐకు అందజేయనున్నది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి.. అవసరమైన మార్పులు, చేర్పులు చేసి ఎన్హెచ్ఏఐ ఫైనల్ చేస్తుంది. ఆ తర్వాత భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తుంది. భూసేకరణ పూర్తయ్యాక టెండర్లు పిలువనున్నది. హైదరాబాద్ ఔటర్రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో 20 చిన్న పట్టణాలు, 300 గ్రామాలను అనుసంధానంచేస్తూ 338 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. దీనిని పూర్తి జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కేంద్రానికి లేఖ రాశారు. భూసేకరణలో 50 శాతం రాష్ట్రప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు, రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ద్వారా కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తులు చేయించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవతో భారత్ మాల ప్రయోజన కార్యక్రమం కింద మొదటి దశ కింద సంగారెడ్డి- నర్సాపూర్-తుప్రాన్- గజ్వేల్-యాదాద్రి-చౌటుప్పల్ వరకు 164 కిలోమీటర్లు రీజనల్ రింగ్రోడ్ నిర్మించడానికి కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐకి ఆదేశాలు ఇచ్చింది. దీనికి 161 ఏఏగా నామకరణం చేసింది. ఈ మొదటి దశ నిర్మాణ పనులు చేపట్టానికి ఎన్హెచ్ఏఐ సిద్ధమైంది. ఈ మేరకు అలైన్మెంట్- డీపీఆర్ కోసం టెండర్లు పిలిచి సంస్థను ఎంపికచేసింది.