హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ప్రధాన ప్రభుత్వ, కార్పొరేట్ దవాఖానలు సొంతంగా ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటుచేసుకొనేలా ఆదేశాలు జారీచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. 45 రోజుల్లోగా కార్పొరేట్ దవాఖానలు సొంత ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, ఇందుకు లైసెన్స్లను పునరుద్ధరించాలని నిర్ణయించినట్టు తెలిపింది. మూడో దశ కరోనా వ్యాప్తి కాకుండా ఆదిలోనే కట్టడి చర్యలకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలియజేసింది. మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి, మందుల సేకరణ, అత్యవసర పరికరాలు కొనుగోళ్లు మొదలైనవాటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రణాళిక అమలుచేస్తున్నట్టు నివేదించింది. కరోనాపై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ హిమాకొహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించిన సందర్భంగా ఆ వివరాలను ప్రజారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు నివేదించారు.
దవాఖానల దోపిడీపై చర్యలు
తొలి దశ కరోనా సమయంలో వైద్యం పేరుతో ఫీజుల దోపిడీకి పాల్పడిన ప్రైవేటు, కార్పొరేటు దవాఖానల నుంచి రూ.3 కోట్ల వరకు రాబట్టి సంబంధిత బాధితులకు అందజేశామని శ్రీనివాస్రావు చెప్పారు. 174 దవాఖానలపై ఫిర్యాదులు అందాయని, 113 దవాఖానలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, 22 దవాఖానల కరోనా వైద్య లైసెన్స్ రద్దు చేశామని, అధిక ఫీజులను రాబట్టి బాధితులకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కోర్టు సూచన మేరకు ప్రైవేటు దవాఖానల్లో కరోనా వైద్యానికి గరిష్ఠ ఫీజు ఎంత ఉండాలనే దానిపై ప్రభుత్వం జీవో జారీ చేసే అంశాన్ని వైద్యారోగ్యశాఖ కార్యదర్శికి నివేదిస్తామన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులు 800 వరకు ఉన్నాయని, 1,500 పడకలు కేటాయించామని, కోఠి ఈఎన్టీ దవాఖానను నోడల్గా ఎంపిక చేశామని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. కరోనా వైద్య లైసెన్స్ రద్దు బదులు, ఫీజులను తిరిగి రాబట్టి బాధితులకు అందజేస్తే ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడింది. మంగళవారం ఓ ప్రైవేటుదవాఖాన రూ.17 లక్షలు బిల్లు వేస్తే ప్రభుత్వ చర్యలతో రూ.10 లక్షలకు తగ్గించి మిగిలిన మొత్తాన్ని బాధితుడికి తిరిగి ఇచ్చిందని శ్రీనివాస్రావు ఉదాహరించారు. కొన్ని ప్రైవేటు దవాఖానలు.. ‘కేసులు దాఖలు చేయబోము’ అని రోగుల నుంచి సంతకాలు చేయించుకుంటున్నాయని చెప్పగా.. ఇలా చేయడం చట్టపరంగా చెల్లుబాటు కాదని హైకోర్టు పేర్కొన్నది. దవాఖానల స్థాయిని బట్టి ఆర్టీపీసీఆర్, సీటీ స్కాన్, రక్త పరీక్షలు, పీపీఈ కిట్లు మొదలైన వాటికి గరిష్ఠ చార్జీలను నిర్ణయిస్తూ తాజా జీవోలు ఇవ్వాలని హైకోర్టు చెప్పగా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జీవోలు ఇస్తామని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియాలంటే సలహా కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది.
10 నాటికి 14 ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలు
రాష్ట్రంలో కొత్తగా 14 ఆర్టీపీసీఆర్ పరీక్ష కేం ద్రాల ఏర్పాటు తుది దశకు చేరుకున్నదనిని, ఈ నెల 10 నాటికి అన్ని కేంద్రాలు వినియోగంలోకి వస్తాయని శ్రీనివాసరావు వివరించారు.
గ్లోబల్ టెండర్కు మంచి స్పందన
రాష్ట్రంలో 45 ఏండ్లు పైబడినవారు 92.58 లక్షల మంది ఉండగా.. తొలి విడుతలో 35.5 లక్షలు, రెండో విడతలో 12.68 లక్షల మందికి టీకాలు వేశామని శ్రీనివాసరావు వివరించారు. 18- 45 ఏండ్ల మధ్యవారు 1.84 కోట్ల మంది ఉండగా.. రెండువారాల్లోనే 7 లక్షల మంది (జన సహాయకులు)కి టీకావేశామని చెప్పారు. ఆగస్టు వరకు వ్యాక్సిన్ను సరఫరా చేయబోమని కేంద్రం చెప్పిందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వమే గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తే స్పుత్నిక్, ఆక్స్ఫర్డ్ కంపెనీల నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు. ఈ నెల 4న టెండర్లను తెరుస్తామని తెలిపారు. కరోనా మూడోదశను ఎదుర్కొనేందుకు ఏవిధమైన బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మౌలిక వసతులు, ప్రాణావసర మందుల నిల్వలు, సిబ్బంది కొరత నివారణ, సలహాకమిటీ ఏర్పాటు, ప్రైవేటు దవాఖానల్లో అధిక ఫీజుల కట్టడికి తీసుకున్న చర్యలు, దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు చేయూత.. తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.