ఇటలీ: శిల్పాలు సాధారణంగా భారీగానే ఉంటాయి. కానీ, రికార్డు సృష్టించాలన్న ఉద్దేశంతో ఇటలీకి చెందిన సాల్వటోర్ గారౌ (67) కంటికి కనిపించనంత అతిచిన్న శిల్పాన్ని తయారు చేశాడు. శిల్పం చిన్నదే అయినా భారీ ధరకు అమ్ముడుపోయింది. ఆ శిల్పాన్ని వేలం వేయగా.. 15 వేల యూరోలు ( మన కరెన్సీలో దాదాపు రూ.13 లక్షలు) పలికింది. అలా సాల్వటోర్ అతిచిన్న శిల్పం రూపకల్పనతో జాక్పాట్ కొట్టేశాడు. కానీ సాల్వటోర్కు ఆ జాక్పాట్ శిల్పంవల్ల రాలేదట, అతని మాటలవల్ల వచ్చిందట.
వివరాల్లోకి వెళ్తే.. సాల్వటోర్ స్వతహాగా మంచి శిల్పి. అతను తయారుచేసే వాటిలో చాలావరకు పైకి ఏం కనిపించకపోయినా దానిలో ఒక పరమార్థం ఉంటుంది. తాజాగా అతను ఐయామ్ అనే పేరిట కనిపించని శిల్పాన్ని తయారు చేశాడు. కానీ అతను ఆ శిల్పాన్ని ప్రదర్శనకు ఉంచినప్పుడు అతను ఏం చూపెట్టాడో అక్కడ ఉన్నవాళ్లకు అర్థం కాలేదు. అయితే సాల్వటోర్ అతను తయారు చేసిన శిల్పం గురించి వివరించాడు.
‘నిజానికి నేను అమ్మింది ఒక శూన్యాన్ని మాత్రమే.. అంటే ఖాళీదని అర్థం. ప్రపంచంలోని ఏ వస్తువుకు బరువు ఉండదు. నేను చూపించే ఈ వాక్యూమ్లోనూ గాలి తప్ప ఇంక ఏం ఉండదు. హైసెన్బర్గ్ సూత్రం ప్రకారం వాక్యూమ్ శక్తితో నిండిన వేగం తప్ప మరొకటి కాదని తెలుసుకున్నా. నా దృష్టి నుంచి చూస్తే విషయం మీకే అర్థమవుతుంది. ఉదాహరణకు మనం నమ్మే దేవుడికి రూపం ఉండటం మీరు గమనించారా..? ఇది కూడా అంతే. నేను చెక్కిన ఈ శిల్పంలోనూ ఒక రూపం ఉంది. మనసు పెట్టి చూడండి’ అని సాల్వలోర్ చెప్పుకొచ్చాడు.
దాంతో అతను చెప్పిన మాటలకు ఇంప్రెస్ అయిన ప్రదర్శన నిర్వాహకులు అతని శిల్పాన్ని 15 వేల యూరోలకు కొన్నారు. కానీ దాన్ని టెస్టిఫై చేయాల్సి ఉంటుందని సాల్వటోర్కు తెలిపారు.