యాదాద్రిలో అద్దాల మండపం ముందు స్వాగతం చెప్పేలా బిగింపు
యాదాద్రి, సెప్టెంబర్ 22: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం భక్తులను ఎంతగానో ఆకట్టుకోనున్నది. ప్రధానాలయంలోని ద్వితీయ ప్రాకారంలో స్వామివారికి వాయు దిశలో నిర్మించిన అద్దాల మండపం ముందు చూడముచ్చటైన ఎర్రరాతి ఐరావతాలను ఏర్పాటు చేసేందుకు వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం గోధుమ వర్ణపు ఐరావతాలు బుధవారం యాదాద్రికి చేరుకున్నాయి. అద్దాల మండపం దాత ఇంద్రసేనారెడ్డి సహకారంతో ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో ఐరావతాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక్కో ఐరావతం 2.50 క్వింటాళ్ల బరువు, ఎత్తు 4 ఫీట్లు, పొడవు 6 ఫీట్లు ఉన్నది. త్వరలో అద్దాల మండపం ముందు ఇరువైపులా స్వాగతం తెలిపేలా ఐరావతాలను ఏర్పాటు చేయనున్నట్టు వైటీడీఏ అధికారులు తెలిపారు.
ఆకట్టుకోనున్న అద్దాల మండపం
ఇప్పటికే అద్దాల మండపాన్ని చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఈ మండపంలో నరసింహస్వామి, లక్ష్మీ అమ్మవార్ల శయనోత్సవం నిర్వహిస్తారు. ఊయలలో ఊగుతున్నప్పుడు స్వామివారి రూపాలు అన్ని వైపులా కనిపించేలా ఈ మండపం ఏర్పాటు చేశారు. ఈ మండపానికి పైభాగంలో ఏకతల విమానంతోపాటు, మండపానికి ఎదురుగా బిగించనున్న ఐరావతాలతో అద్దాల మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకోనున్నది.