హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డును సృష్టించింది. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో సైతం సాధ్యం కానిది కేవలం ఏడు సంవత్సరాల తెలంగాణలో సుసాధ్యమైంది. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఈ యాసంగిలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసి గత ఏడాది రికార్డును తిరగరాసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గత ఏడాది యాసంగిలో పౌరసరఫరాల సంస్థ 64.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా తాజాగా ఈ యాసంగిలో దాన్ని బ్రేక్ చేస్తూ 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు తిరగరాసిందని తెలిపారు.
ఈ ఘనత గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దార్శనికత వల్లనే సాధ్యమైందన్నారు. సీఎం నాయకత్వంలో ఏడు సంవత్సరాల్లో భారతదేశమే అబ్బురపడే విధంగా వ్యవసాయరంగం అభివృద్ధి చెందిందన్నారు. వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అని నిరూపించారన్నారు. వ్యవసాయమే సాధ్యం కాదన్నచోట ఏడాదిలో కోటి టన్నులకు పైగా ధాన్యం పండించి చూపించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేసి సీఎం కేసీఆర్ రైతులకు అడుగడుగునా అండగా నిలిచారన్నారు.
ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం ఏర్పడడం వల్ల రైతులు రాష్ట్రంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో పంటలు పండిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతితో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తరువాత పరిస్థితిని గమనిస్తే ధాన్యం కొనుగోళ్లలో సాధించిన పురోగతి కళ్లకు కట్టినట్లు కనబడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది 2014-15లో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా నేడు 67 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోవడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు.
ఈ యాసంగిలో ఇంకా10 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. 10 లక్షల మంది రైతుల నుండి రూ. 12,247 కోట్ల విలువ చేసే 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, గత ఏడాది ఇదే సమయానికి 56.82 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, కొత్తగూడెం, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు.