ధరణిలో సరికొత్త రికార్డు
కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ల జోరు
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో భూ లావాదేవీల వేగం పెరిగింది. ముఖ్యంగా భూముల విలువను రాష్ట్ర ప్రభుత్వం సవరించిన తర్వాత రికార్డుస్థాయిలో స్లాట్లు బుక్ అవుతున్నాయి. సవరించిన ధరలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే రోజు వ్యవసాయ భూముల లావాదేవీల కోసం రికార్డుస్థాయిలో 5వేలకుపైగా స్లాట్లు బుక్ అయ్యాయి. తర్వాతి రోజుల్లోనూ జోరు తగ్గలేదు. ఫలితంగా మూడ్రోజుల్లోనే రిజిస్ట్రేషన్, సక్సెషన్, పార్టిషన్, పెండింగ్ మ్యుటేషన్, నాలా కన్వర్షన్ కలిపి 15 వేలకుపైగా స్లాట్లు బుక్ అయ్యాయి. సగటున రోజుకు 5వేల మంది స్లాట్లు బుక్ చేసుకున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్ల జోరు కొనసాగుతున్నది. రోజుకు 3 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. సవరించిన ధరలకు అనుగుణంగా పోర్టల్లో మార్పులు చేయటంతో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలుగటం లేదు.
బుక్ అయిన స్లాట్లు, రిజిస్ట్రేషన్లు
తేదీ స్లాట్లు రిజిస్ట్రేషన్లు
22 5,511 3,195
23 5,349 3,297
24 4,331 2,874
మొత్తం 15,191 9,366