మేడ్చల్, మే 22 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్ ఆలయ భూముల వ్యవహారంపై విచారణ లోతుగా సాగుతున్నది. ఐఏఎస్ల ప్రత్యేక విచారణ కమిటీ ఆదేశాల మేరకు విజిలెన్స్, ఏసీబీ ఉన్నతాధికారులు తార్నాకలోని రాజ్యాభిలేఖనం (స్టేట్ అర్చివ్) కార్యాలయంలో ఉన్న పురాతన లిపి పహాణీలను, పత్రాలను పరిశీలించే పనిలో ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలను సేకరించేందుకు పురాతన లిపి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది. దేవరయాంజాల్లోని ఆలయ భూములను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కబ్జా చేసినట్టు వచ్చిన ఆరోపణలపై ఏ ఒక్క ఆధారాన్ని వదలకుండా పక్కాగా సేకరించే పనిలో ప్రత్యేక విచారణ కమిటీ నిమగ్నమైంది. 1,525 ఎకరాల ఆలయ భూములకు సంబంధించిన పురాతన లిపి పహాణీలు, పత్రాలను పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి. నిజాంకాలంలోనే దేవరయాంజాల్ సీతారామస్వామి దేవాలయానికి 1,525 ఎకరాలు కేటాయించినందున దీనికి సంబంధించిన పత్రాలు పూర్తి ఆధారాలతో రాజ్యాభిలేఖనం కార్యాలయంలో లభ్యమయ్యే అవకాశం ఉన్నదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
పలు కోణాల్లో విచారిస్తున్న విజిలెన్స్ అధికారులు
ఆలయ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారు.. రిజిస్ట్రేషన్లు ఎలా అయ్యాయి అనే కోణంలో విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన సమయంలో విధుల్లో ఉన్న ఉద్యోగులను విచారించి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. 2004లో ఆలయ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపి వేయాలని అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ ఎలా చేశారన్న విషయమై విచారణ కొనసాగుతున్నది. జీవో ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు అయినవాటికి రెవెన్యూ అధికారులు చేసిన మ్యుటేషన్లపై ఆరా తీస్తున్నారు. అప్పటి తాసిల్దార్లను విచారిస్తున్నట్టు సమాచారం. దేవరయాంజాల్లోని ఆలయ భూముల్లో 160 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు ప్రత్యేక విచారణ కమిటీ నిర్ధారించిన విషయం తెలిసిందే. వివిధ విభాగాల అధికారుల విచారణ రెండు రోజుల్లో ముగియనున్నట్టు తెలుస్తున్నది.