సీఆర్ఎఫ్ రూ.620 కోట్లు వెంటనే విడుదల చేయాలి
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరిన టీఆర్ఎస్ ఎంపీల బృందం
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి, వాటి నిర్మాణం చేపట్టాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని టీఆర్ఎస్ ఎంపీల బృందం కోరింది. టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీల బృందం శుక్రవారం మంత్రి గడ్కరీని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలోని అంతర్గత, ఇతర రాష్ర్టాలతో అనుసంధానమై ఉన్న నాలుగు రోడ్లు (చౌటుప్పల్-షాద్నగర్-కంది (ఆర్ఆర్ఆర్) 186 కిలోమీటర్లు, కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి పిట్లం 165 కిలోమీటర్లు, కొత్తకోట గూడూరు మంత్రాలయం 70 కిలోమీటర్లు, జహీరాబాద్ బీదర్-డెగ్లూర్ 25 కిలోమీటర్లు) ను జాతీయ రహదారులుగా గుర్తించాలని ఆ బృందం కోరింది. తెలంగాణకు 2021 సంవత్సరానికి రావాల్సిన సెంట్రల్ రోడ్డు ఫండ్స్ (సీఆర్ఎఫ్) రూ. 620 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడలో ఇప్పటికే ఉన్న డబుల్రోడ్ను నాలుగు లైన్ల రహదారిగా మార్చాలని కోరారు. హైదరాబాద్ చుట్టూ నిర్మిస్తున్న రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల గడరీకి టీఆర్ఎస్ ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు.