హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రామప్ప రూపంలో 30-40 ఏండ్ల తర్వాత దక్షిణభారతానికి గుర్తింపు వచ్చిందని, ఈ గుర్తింపు రావటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషి గొప్పదని ప్రొఫెసర్ చూడామణి నందగోపాల్ అన్నారు. రామప్పను యునెస్కో అంతర్జాతీయ వారసత్వ కట్టడంగా గుర్తించటం తన జీవితంలో మరచిపోలేని అనుభూతి అని ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. రామప్ప గుర్తింపులో తనను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యునెస్కో గుర్తింపు కోసం రామప్ప చరిత్ర, నిర్మాణ సౌష్ఠవం, కళా సంస్కృతులు తదితర అంశాలపై డోసియర్ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీవీ పాపారావు, ప్రొఫెసర్ ఎం పాండురంగారావు మైసూర్ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన చూడామణి నందగోపాల్ను కోరారు.
పురావస్తు, శిల్పకళలో నిష్ణాతులైన ప్రొఫెసర్ చూడామణి సుదీర్ఘకాలం పాలంపేటలోని రామప్ప లో ఉంటూ విస్తృత పరిశోధనలు చేశారు. రామప్పలో అర ఇంచు నుంచి ఆరు అడుగుల విగ్రహాల సాంస్కృతిక మేళవింపును డోసియర్లో పొందుపరిచారు. చారిత్రక కట్టడంగా రామప్పను యునెస్కో గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆమె నమస్తే తెలంగాణతో మా ట్లాడారు. రామప్ప విభిన్న సంస్కృతుల మేళవింపు అని, ఇక్కడ ఉండే శిల్పకళ వైవిధ్యానికి ఎప్పుడో దక్కాల్సిన గౌరవం ఇప్పుడు దక్కిందని ఆమె పేర్కొన్నారు. పాలంపేట ప్రజలు అదృష్టవంతులని ఆమె పేర్కొన్నారు.