జనగామ రూరల్, జూన్ 8 : గ్రామాల్లో రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని డీఆర్డీవో గుడూరు రాంరెడ్డి ఆదేశించారు. మండలంలోని అడవికేశ్వాపూర్, ఎర్రగొల్లపహాడ్, వెంకిర్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లోని ధాన్యం నిల్వలను తొందరలోనే తరలిస్తామని చెప్పారు. లారీల కొరత ఉందని రైతులు చెప్పడంతో ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం నరేందర్, మహిళా సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
చౌడారంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి
చౌడారం గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు మంగళవారం పూర్తి చేశారు. 19,974 బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా.. 7,989 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమచేస్తున్నది. ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావడంతో రైతులు, హమాలీలు సంబురాలు జరుపుకున్నారని బుక్ కీపర్ యాసారపు ప్రవీణ్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోళ్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, మిల్లు యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతులు, హమాలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వారం రోజుల్లో ధాన్యం తరలింపు : తహసీల్దార్
దేవరుప్పుల : మండలంలోని 19 కేంద్రాల్లో 3,840 మంది రైతుల నుంచి రెండు లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తహసీల్దార్ స్వప్న తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ 90 శాతం ధాన్యం ఇప్పటికే తరలించామని, మిగిలిన పది శాతం ధాన్యాన్ని వారం రోజుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు తమ సొంత ట్రాక్టరల్లో తూకం వేసిన ధాన్యాన్ని తరలిస్తే పనులు తొందరగా ముగుస్తాయన్నారు. మండల వ్యాప్తంగా 50 లారీల ధాన్యం ఉంటుందని అంచనా వేస్తున్నామని, వాన కాలం దృష్ట్యా పనులు వేగంగా చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు చెప్పారు. 11 ఐకేపీ కేంద్రాల్లో 1,963 మంది రైతుల నుంచి లక్షా975 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 1,877 మంది రైతుల నుంచి 88,985 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవీందర్రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.