సిద్దిపేట టౌన్, మే 23 : లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన చౌరస్తాల్లో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి ఉల్లంఘనలు నివారిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చే వారిపై కొరడా ఝలిపిస్తున్నారు. లాక్డౌన్ అమలు తీరును పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. వాహనాల తనిఖీలో పాల్గొని ఉల్లంఘనల వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం లాక్డౌన్ తీరును పరిశీలించారు. స్వయంగా సందర్శించి నిబంధనలు అతిక్రమించిన దుకాణదారులను మందలించారు. గుంపులు గుంపులుగా ప్రజలు ఎక్కడా చేరవద్దని సూచించారు. 24 గంటల పాటు ప్రజలకు రక్షణగా ఉండి పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని, వారి సూచనలు, సలహాలు పాటించాలని చెప్పారు. ఆన్లైన్ ద్వారా 2198 ఈ పాసులను అందించామన్నారు. లాక్డౌన్, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు ప్రకారం 2046 కేసులను నమోదు చేశామని పేర్కొన్నారు. 215 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా లాక్డౌన్ అమలుపర్చుతున్నామని, ప్రజలందరూ సహకరించాలని కోరారు.