సీపీఎస్ ఉద్యోగుల కల సాకారం
పెన్షన్తో కుటుంబాలకు ధీమా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లికి చెందిన ఈ చిన్నారి పేరు లేఖిత. తల్లిదండ్రులు సునీత, రాము. రాము డీఎస్సీ 2008 ద్వారా నియమితులైన సీపీఎస్ ఉద్యోగి. ఆయన 2018 జనవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. సంపాదించే వ్యక్తి దూరమవడం, ఫ్యామిలీ పెన్షన్ సదుపాయం లేకపోవడంతో ఆ కుటుంబం రెండేండ్లుగా వేదన అనుభవిస్తున్నది. ఆర్థికంగా కుదేలైంది. ఈ ప్రభావం పాప చదువుపై పడింది. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ అందిస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆ కుటుంబంలో సంతోషం నింపింది. సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ.. లేఖిత సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసింది. చీకట్లు నిండిన తమ జీవితంలో ఇదొక కొత్త వెలుగు అని రాము భార్య సునీత సంతోషం వ్యక్తంచేశారు.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మండలం గోపాల్పూర్కు చెందిన మురళీధర్ 2014లో నీటిపారుదల శాఖలో నాలుగో తరగతి ఉద్యోగిగా చేరారు. 2018 ఫిబ్రవరిలో మురళీధర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు భార్య సునీత, కొడుకు విశాల్, కూతురు భావన ఉన్నారు. విశాల్ మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు. సునీతకు కారుణ్య నియామకం కింద అటెండర్ ఉద్యోగం వచ్చినా.. కొడుకు చికిత్స, భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన వారి కుటుంబంలో సంతోషాన్ని నింపింది. కొడుకుకు ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుందని సంబురపడుతూ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): సీపీఎస్ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరింది. కుటుంబ పెన్షన్ కోసం ఎదురుచూపులకు తెరపడింది. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో లక్షన్నర మంది ఉద్యోగులకు భరోసా దక్కింది. కేంద్రం ఆదేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానం అమల్లోకి వచ్చింది. దీనిప్రకారం 2004 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ వర్తించదు. సర్వీస్, ఫ్యామిలీ పెన్సన్కు అర్హులు కాదు. దీంతో ఈ విధానాన్ని వ్యతిరేకించారు.
దశాబ్దాలుగా విన్నపాలు
రాష్ట్రంలో 1.50 లక్షల మంది సీపీఎ స్ ఉద్యోగులున్నారు. సర్వీస్లో ఉండగా ఎవరైనా మరణిస్తే ఈ విధానంతో కు టుంబాలు ఆగమవుతున్నాయి. సంపాదించేవారిని కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కనీసం ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చి కుటుంబాలకు అండగా నిలువాలని ఏండ్లుగా కో రుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ వారి ఆకాంక్షను నెరవేర్చారు. 1980 రివైజ్డ్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫ్యామిలీపెన్షన్ కల్పిస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. దీంతో ఉద్యోగి మరణిస్తే వారి చివరి బేసిక్ పేలో 50% పెన్షన్ రూపంలో ఏడేండ్లపాటు జీవిత భాగస్వామికి లేదా నామినీకి అందుతుంది. తర్వాత 30 శాతం జీవితాంతం పెన్సన్ రూపంలో అందుతుంది. ఈ నిర్ణయంపై సీపీఎస్ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేసున్నారు.