హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో అభివృద్ధి సాధించి జాతీయస్థాయి పురస్కారాలను దక్కించుకున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సన్మానించారు. స్థానిక సంస్థలకు, 2019-20 సంవత్సరానికి కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన దీన్దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తీకరణ్ పురస్కార్కు తెలంగాణ నుంచి ఎంపికైన గ్రామ, మండల, జిల్లా పరిషత్ ప్రజాప్రతినిధులను శుక్రవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సన్మానించి, అభినందించారు. ఇదే ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, సీఎస్ సోమేశ్కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కార్యదర్శి రఘునందన్రావు పాల్గొన్నారు. సన్మానంపొందినవారిలో సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ, సంగారెడ్డి జడ్పీ సీఈవో ఎల్లయ్య, ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణ, పెద్దపల్లి డీపీవో గీత, కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, కరీంనగర్ జిల్లా పర్లపల్లి సర్పంచ్ మాదాడి భారతీ నర్సింహారెడ్డి, రాజన్నసిరిసిల్ల జిల్లా హరిదాస్నగర్ సర్పంచ్ టీ అమృత, సిద్దిపేట జిల్లా మిట్టపల్లి సర్పంచ్ వంగ లక్ష్మి, మల్యాల సర్పంచ్ ధరిపల్లి వజ్రవ్వ, ఆదిలాబాద్ జిల్లా రుయ్యాడి సర్పంచ్ పుండ్రు పోతారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా చక్రాపూర్ సర్పంచ్ శైలజ, సుందిళ్ల సర్పంచ్ దాసరి లక్ష్మి, రాజన్నసిరిసిల్ల జిల్లా మోహినికుంట సర్పంచ్ కల్వకుంట్ల వనజ తదితరులు ఉన్నారు.
నిధుల కోసం కేంద్రానికి లేఖరాస్తాం: ఎర్రబెల్లి
ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలుచేయడంలో ముందున్నారని అవార్డులు పొందిన ప్రజాప్రతినిధులను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. ప్రగతిభవన్లో సన్మానానికి ముందు రంగారెడ్డి జడ్పీ ఆవరణలోని సమావేశ మందిరంలో మంత్రి వారితో సమావేశమయ్యారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాలు దేశంలోనే ఆదర్శంగా మారాలనేది సీఎం కేసీఆర్ ఆశయమని పేర్కొన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టంతో పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనాన్ని పెంచారని గుర్తుచేశారు. ఇన్ని చేస్తున్నా కేంద్రం మాత్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ. 1,840 కోట్లకుగాను రూ.1,360 కోట్లే ఇస్తున్నదని చెప్పారు. నిధులు తగ్గించవద్దని, అదనంగా ఇవ్వాలని కోరుతూ సీఎం కేసీఆర్తో కేంద్రానికి లేఖ రాయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్, సుధాకర్, వెస్లీ పాల్గొన్నారు.