హైదరాబాద్, జూన్ 19,(నమస్తే తెలంగాణ): భారత వాయుసేన పటిష్ఠంగా ఉన్నదని, దేశ రక్షణలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నదని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా అన్నారు. దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన ఫ్లయింగ్ క్యాడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 161 మంది నూతన ఫ్లయింగ్ క్యాడెట్లు, ఆరుగురు నేవీ, ఐదుగురు కోస్ట్గార్డు క్యాడెట్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించి విధుల్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బదౌరియా మాట్లాడుతూ.. ఉత్తమ క్యాడెట్లను తీర్చిదిద్దుతున్న దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీని ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో 36 రాఫెల్ యుద్ధవిమానాలు వాయుసేనలో చేరతాయని ఎయిర్చీఫ్ మార్షల్ బదౌరియా అన్నారు. గల్వాన్ ఘటన తర్వాత చైనా సరిహద్దుల్లో భద్రతను పెంచి మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామన్నారు.