నారాయణఖేడ్, జూన్ 16 : నారాయణఖేడ్ ప్రజలు ఎదుర్కొంటున్న సాగు నీటి సమస్యను తీర్చే బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి నీటిపారుదల అధికారులు, సర్వే సంస్థ ప్రతినిధులకు సూచించారు. బుధవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒప్పందం మేరకు మూడు నెలల్లో సర్వే పనులను పూర్తి చేయాలన్నారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 1.31 లక్షల ఎకరాలు, అందోల్ నియోజకవర్గంలోని 34 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. ఇది కాక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 19ఏ ప్యాకేజీలో భాగంగా మరో 35 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం పరిధిలోకి రాని మిగతా భూములను సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిజాంసాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్టుల ద్వారా నీరందించేందుకు అనువుగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో నీటిపారుదల శాఖ నారాయణఖేడ్ డివిజన్ ఈఈ భీమ్, డిప్యూటీ ఈఈ జలంధర్, ఏఈఈలు దిలీప్కుమార్, నాగరాణి, సర్వే సంస్థ ప్రతినిధులు సారథి, వెంకట్రెడ్డి, ఆత్మ చైర్మన్ రామ్సింగ్, కల్హేర్ జడ్పీటీసీ నర్సింహారెడ్డి, సిర్గాపూర్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు రవీందర్నాయక్, రమేశ్చౌహాన్, వెంకట్రెడ్డి, కోట ఆంజనేయులు, సంగప్ప, పరమేశ్ పాల్గొన్నారు.
21న మంత్రి హరీశ్రావుచే శ్రీకారం
ఈనెల 21వ తేదీన మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తెలిపారు. మనూరు మం డలం బోరంచ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించి పనులను లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. ఈ విషయమై ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామని, అందుకనుగుణంగా బోరంచలో ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.
రూ.84 లక్షలతో ఖేడ్లో డయాగ్నస్టిక్ సెంటర్
నారాయణఖేడ్లో త్వరలో రూ.84 లక్షలతో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తెలిపారు. ఈ మినీ డయాగ్నస్టిక్ సెం టర్లో ఉచితంగా 54 రకాల పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. వివిధ పరీక్షల కోసం నిరుపేదలు వేలాది రూపాయ లు వెచ్చించి పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలకు ఈ డ యాగ్నస్టిక్ సెంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నా రు. సత్వరమే నారాయణఖేడ్లో ఈ డయాగ్నస్టిక్ సెంటర్ అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రైతుబీమా చెక్కు అందజేత
నాగల్గిద్ద మండలం శేరిదామరగిద్ద గ్రామానికి చెందిన మహిళా రైతు శోభమ్మ మృతి చెందడంతో రైతుబీమా పథకం ద్వారా మంజూరైన రూ.5 లక్షల చెక్కును నారాయణఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి శోభమ్మ భర్త శివరాజ్కు అందజేశారు.