సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 3 : సిద్దిపేట డిగ్రీ పీజీ కళాశాల ఎన్నో ప్రత్యేకతల సమాహారం.. అటానమస్ హోదా కళాశాలగా గుర్తింపు.. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. మొట్టమొదటి సారిగా 1989 సంవత్సరంలో పీజీ కోర్సులు ప్రారంభమయ్యాయి. భౌతిక శాస్త్రం మొదలుకొని ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, మత్స్యశాస్త్రం, ఎంఏ తెలుగు ఇలా ఆరు రకాల కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి కోర్సులో 30సీట్లను కేటాయించగా, ఎంఏ తెలుగులో మాత్రం 40సీట్లు ఉన్నాయి. ఏటా 190 మంది విద్యార్థులు కళాశాలలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దినదినా అభివృద్ధి చెందుతున్నది. చుట్టు పక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణం నుంచి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులందరూ సిద్దిపేటలోనే పీజీ చేయాలనే ఉద్దేశంతో సిద్దిపేటకు వస్తుంటారు. దీంతో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విషయం కమిషనర్ నవీన్మిట్టల్ దృష్టికి తీసుకెళ్లగా.. ఉస్మానియా యూనివర్సిటీ వారు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలకు ఇటీవల 170 సీట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా నిర్ణయంతో మరింత మంది పట్టణ, గ్రామీణ విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునేందుకు మంచి అవకాశం కలిగింది. ప్రతి కోర్సులో 30 సీట్లు ఉండగా, సీట్లను పెంచడంతో ఒక్కో కోర్సులో 60 సీట్లకు సంఖ్య పెరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచే పెంచిన సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కళాశాలలో సీట్లు పెరుగడంతో పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు ఉన్నత విద్య
కళాశాలలో పీజీ సీట్లు పెరుగడంతో గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందనున్నది. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో అదనంగా 170 సీట్లు కళాశాలకు మంజూరయ్యాయి. తాజా నిర్ణయంతో డిగ్రీ, పీజీ కళాశాలలో సీట్ల సంఖ్య 360కి చేరుకుంది. ఈ నిర్ణయంతో విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది.