హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టే అని రాష్ర్ట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి వేముల మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఆపాలని కృష్ణా బోర్డు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రాంత నాయకులు దీనికి ఏం సమాధానం చెబుతారు అని మంత్రి ప్రశ్నించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశంతో రాయలసీమ ఎత్తిపోతల అక్రమమని తేలిపోయిందన్నారు. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు కట్టవద్దని బోర్డు స్పష్టంగా చెప్పిందన్నారు. కృష్ణా బోర్డు ఆదేశాల ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలని ఏపీ సీఎం జగన్ను డిమాండ్ చేస్తున్నామని మంత్రి వేముల పేర్కొన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా రాయలసీమ ప్రాజెక్టులను కట్టొద్దని ఆదేశించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన వారం రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. జులై 25, 2020న మరోసారి కృష్ణా బోర్డుకు లేఖ రాశాం. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత కేంద్రానికి, కృష్ణా బోర్డుకు ఏడు లేఖలు రాశామని మంత్రి గుర్తు చేశారు.
రాయలసీమ ఎత్తిపోతలపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే నాటి కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ హారతి పట్టారు. పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యం 4 రెట్లు పెంచింది కాంగ్రెస్ హయాంలో కాదా? అని అడిగారు. పోతిరెడ్డిపాడు విస్తరణకు నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ బయటకు వచ్చిందన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఎందుకు న్యాయపోరాటం చేయదు? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్పై కోర్టులకు వెళ్లే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. తెలంగాణ బిడ్డగా వైఎస్సార్ను విమర్శించడం తప్పా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా నీటిని అక్రమంగా తరలించుకుపోతోంది. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతే తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టినట్లే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆపాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.