మేడ్చల్, మే 24 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనయుడు నితిన్రెడ్డి భూవ్యవహారంపై సోమవారం రెవెన్యూ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు వేర్వేరుగా విచారించారు. మేడ్చల్ మండలం రావల్కోల్కు చెందిన బాధితుడు పిట్ల మహేశ్ సర్వే నంబర్ 77లోని 10.11 ఎకరాల భూమిని ఈటల నితిన్రెడ్డి చెరపట్టినట్టు సీఎం కేసీఆర్కు ఫిర్యాదుచేశారు. స్పందించిన సీఎం తక్షణమే విచారణ ప్రారంభించాలని సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించిన విషయం విదితమే. మేడ్చల్ తాసిల్దార్ కార్యాలయం లో ఫిర్యాదుదారుడు పిట్ల మహేశ్ను రెవెన్యూ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు విచారించి, భూమికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. బాధితుడు తన వద్ద ఉన్న 38(ఈ) సర్టిఫికెట్, 1954 నుంచి 1986 వరకు రికార్డుల్లో తన కుటుంబసభ్యులు పేర్లు ఉన్నాయని, టెనెన్సీ ప్రకారం అనేక ఏండ్లుగా హక్కుదారులగా ఉన్నామని విచారణలో వెల్లడించగా వివరాలను అధికారులు రికార్డుచేసుకున్నారు. పిట్ల మహేశ్ వద్ద భూమికి సంబంధించిన పత్రాలు తీసుకున్నట్టు పత్రం రాయించుకున్నారు.
భూమిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు
తన భూమి కబ్జాకు గురైందన్న బాధితుడి ఫిర్యాదు మేరకు రెవెన్యూ ఆర్ఐస్థాయి అధికారి శ్రీనివాస్రెడ్డి రావల్కోల్లోని సర్వే నంబర్ 77లో గల 10.11 ఎకరాల భూమిని పరిశీలించారు. ప్రస్తుతం భూమి ఎవరి కబ్జాలో ఉన్నదనే వివరాలను సేకరించారు. ఈ నివేదికలను రెవెన్యూ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు ఇవ్వనున్నారు.
సర్వే నంబర్ 84 వివరాలు కోరిన మరో బాధితుడు
సీలింగ్ భూములు ఉన్న సర్వే నంబర్ 84లో తన 4.25 ఎకరాలు కబ్జాకు గురైనట్టు మరో బాధితుడు మందాపురం నరేశ్ అనే వ్యక్తి మేడ్చల్ తాసిల్దార్ గీతకు ఫిర్యాదుచేశారు. తన తాత పేరిట ఉన్న భూమి వివరాలను అందించాలని దరఖాస్తు చేసుకున్నారు. 2018లో భూ వివరాలను ఇవ్వాలని దరఖాస్తు చేసినా ఇంతవరకు అందించలేదని బాధితుడు పేర్కొన్నారు.
విచారణ ప్రారంభించాం
బాధితుడు పిట్ల మహేశ్ ఫిర్యాదు మేరకు భూవ్యవహారంపై విచారణ ప్రారంభించాం. 77 సర్వే నంబర్లోని 10.11 ఎకరాల భూమిని ఈటల నితిన్రెడ్డి కబ్జాచేసినట్టు సీఎం కేసీఆర్కు ఫిర్యాదుచేశారు. సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశాల మేరకు బాధితుడితో మాట్లాడి వివరాలు సేకరించాం.