హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అర్చక రథయాత్ర తీర్థప్రసాదాలతోపాటు ప్లవ నామ సంవత్సర పంచాగమును బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారికి శనివారం సంఘం అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ అందజేశారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 2,544 ఆలయాలను కలుపుతూ రథయాత్రతోపాటు పూజా కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ.. అర్చక సంఘం నిర్వహించిన పూజా కార్యక్రమాలు, చండీ రుద్రహోమం వల్ల రాష్ర్టానికి మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రమణాచారిని కలిసినవారిలో గ్రేటర్ హైదరాబాద్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణమాచారి, మాజీ కార్పొరేటర్ నరేంద్రాచార్యులు, నందనం హరికిషన్శర్మ, అనిల్శర్మ తదితరులు పాల్గొన్నారు.