హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ ధూంధాం చేసినవిధంగానే ఇకనుంచి ప్రతి ఊరు, వాడలో తెలంగాణ ప్రగతి ధూంధాం నిర్వహిస్తామని సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ చెప్పారు. స్వరాష్ట్రంలో వివిధ సమస్యలను పరిష్కరించిన తీరు ను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని దళితులు సద్వినియోగం చేసుకొనేలా కళారూపాలు ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్లోని సాంస్కృతిక సారథిభవన్లో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న సమక్షంలో సోమవారం తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ.. గతంలో పల్లెపల్లెన పల్లేర్లు మొలిచే.. అని పాడినం.. ఇవాళ పల్లెపల్లెన పంట పొలా ల్లో పచ్చని మొక్కలు మొలుస్తున్నయి అని పాడేలా సీఎం కేసీఆర్ మార్పు తీసుకొచ్చారని చెప్పారు. త్వరలోనే క్యాలెండర్ రూ పొందించుకొని, పథకాలను ప్రజలకు చేరవేసేవిధంగా సాంస్కృతిక ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
దళిత కుటుంబాలకు భరోసా
దళితబంధు లాంటి అద్భుతమైన పథకం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రసమయి బాలకిషన్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని చెప్పారు. కళాకారుడినైన నన్ను రెండుసార్లు ఎమ్మెల్యేను చేసి, మూడుసార్లు సారథిగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ప్రజలను కదిలించింది కళాకారులే: వినోద్కుమార్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కళాకారుల పాత్ర చాలా గొప్పదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కొనియారు. రసమయి బాలకిషన్ తెలంగాణ ధూంధాం కార్యక్రమాలు నిర్వహించి, కోట్లాది మందిని కదిలించారని ప్రశంసించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఏడేండ్లలోనే అద్భుతమైన తెలంగాణను ఆవిష్కరించామని, సీఎం కేసీఆర్ ముందు చూపుతో వంద పథకాల్లో తెలంగాణ నేడు దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీఆర్ఎస్ నాయకులు, కళాకారులు పాల్గొన్నారు.