హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్వేవ్లో వైరస్ సోకినవారిని బ్లాక్ ఫంగస్ భయపెడుతున్నది. కొవిడ్ మరణాలకు వైరస్ కంటే బ్లాక్ ఫంగసే కారణంగా మారుతున్నది. ఈ క్రమంలో గాంధీ దవాఖాన వైద్యులు బ్లాక్ ఫంగస్ సోకిన కరోనా రోగికి 6 గంటల్లో 3 శస్త్రచికిత్సలు నిర్వహించి ప్రాణాలు కాపాడారు. రూ.15 లక్షల ఖరీదైన శస్త్రచికిత్సలను పైసా ఖర్చులేకుండా నిర్వహించి పునర్జన్మ ప్రసాదించారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన 45 ఏండ్ల వయస్సుగల వ్యక్తికి 15 రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైరస్ నుంచి కోలుకుంటున్న సమయంలోనే బ్లాక్ఫంగస్ సోకింది. దీంతో అతడి ఎడమ దవడ, కన్ను భాగం వాయడంతో నాలుగురోజుల క్రితం గాంధీ దవాఖానలో చేరాడు. పరీక్షించిన డాక్టర్లు అతడికి మూడు శస్త్రచికిత్సలు జరపాలని నిర్ణయించారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు సూచన మేరకు ఈ నెల 25న ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ శోభన్బాబు ఆధ్వర్యంలో డాక్టర్లు జేబీఎస్.రాథోడ్, కబీర్, విజయ్కుమార్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి సుబోధ్, అంబిక, ఆప్తమాలజీ విభాగాధిపతి రవిశేఖర్, అనిత, అనస్తీషియా విభాగాధిపతి మాధురి, అప్పారావు, రామకృష్ణ కలిసి ఎండోస్కోపిక్ సైనస్, మాగ్జిలెక్టమి, ఆర్బిటల్ ఆక్సెన్ట్రేషన్ అనే మూడు శస్త్రచికిత్సలను ఒకేసారి నిర్వహించి.. రోగి ఏడమవైపు కన్ను, దవడ భాగాన్ని పూర్తిగా తొలగించారు. ఒక రోగికి ఒకేసారి మూడు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుంటాయని డాక్టర్లు తెలిపారు. నాలుగు విభాగాల వైద్యబృందాలు సుమారు ఆరుగంటల పాటు శ్రమించి సర్జరీలు చేసినట్టు ఆర్ఎంవో-1 డాక్టర్ నరేందర్కుమార్ తెలిపారు.