హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ప్రాణహిత-గోదావరి బేసిన్ చరిత్ర పూర్వయుగం నుంచి అరుదైన జంతుజాలానికి ఆవాసం. ఇప్పటికే ఆ ప్రాంతంలో అనేక శిలాజాలు వెలుగుచూశాయి. కోటసారస్ యెమెన్పల్లెన్సిస్, రింకోసారస్ జాతికి చెందిన డైనోసర్, స్టెగోడాన్ వంటి వేలఏండ్ల క్రితం అంతరించిన ఏనుగుజాతికి చెందిన శిలాజాలు వెలుగుచూశాయి. తాజాగా అదే ప్రాంతంలో లక్షల ఏండ్ల క్రితం నివసించిన అరుదైన సరీసృపజాతిని కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్(ఐఎస్ఐ) పరిశోధకులు గుర్తించారు. 20వ శతాబ్దం మధ్యలో గుర్తించిన అనేక శిలాజాలను ఐఎస్ఐలో భద్రపరిచారు. వాటిలోయెరపల్లి రాతి నమూనా శిలాజాలపై అక్కడి పేలియాంటాలజిస్టులు, అంతర్జాతీయ పరిశోధన బృందంతో కలిసి సుదీర్ఘకాలంగా పరిశోధన చేసి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆ శిలాజం 240 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించి అంతరించిపోయిన మాంసాహార సరీసృప జాతి ఎరిథ్రోసుచిడేకు చెందినదిగా నిర్ధారించారు.
భారీతలాసుచస్ తపానిగా నామకరణం
శాస్త్రవేత్తలు ఆ శిలాజానికి ‘భారీతలాసుచస్ తపన్గా’ నామకరణం చేశారు. అందులో భారీ అంటే పెద్దదైన, తల అంటే పుర్రె, సుచస్ అనేది మొసలి తల కలిగిన ఈజిప్టు దేవత పేరు. ఇక తపాని అనేది భారతీయ పాలింయాంటాలజిస్ట్ తపానీరాయ్ చౌదరి పేరు. భారతీయ సకశేరుక పాలియెంటాలజీకి, ముఖ్యంగా యెరపల్లి టెట్రాపోడ్ జంతుజాలంపై విశేష పరిశోధనలు చేసిన తపాని రాయ్చౌదరి గౌరవార్థం దానికి ఆ పేరు పెట్టారు.