హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): విధిని జయించి విజయాలతో దూసుకుపోతున్న యువ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లాను మరో అరుదైన గౌరవం వరించింది. పుట్టుకతోనే అంధుడైనప్పటికీ అసాధారణ పోరాట పటిమతో పారిశ్రామికవేత్తగా దూసుకుపోతున్న ఆయన ప్రఖ్యాత జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ (జేసీఐ) టాప్ టెన్ ప్రతిభావంతుల్లో చోటు సంపాదించారు. జేసీఐ 50 దేశాల నుంచి 200 మందిని ఎంపికచేయగా ఆన్లైన్ ఓటింగ్లో శ్రీకాంత్ మొదటి పది స్థానాల్లో చోటు సంపాదించారు. శ్రీకాంత్ను ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.
విధికి ఎదురెళ్లి
ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం సమీపంలోని సీతారామాపురంలో 1992లో జన్మించిన శ్రీకాంత్కు చూపులేదు. అయినా అతడు అధైర్యపడలేదు. చదువులో చురుకైన విద్యార్థి అయిన శ్రీకాంత్, ఇంటర్లో సైన్స్ సబ్జెక్టు చదవటానికి న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. చదవటానికే వీలులేదన్న సబ్జెక్టులోనే ఆయన ఏకంగా 98శాతం మార్కులు సాధించటం విశేషం. అతడి వైకల్యం కారణంగా ఐఐటీ కోచింగ్కు నిరాకరించబడినా, పడిలేచిన కెరటంలా ఏకంగా అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్లోనే సీటు సంపాదించి ఉన్నత చదువులు చదివారు. అక్కడ మంచి అవకాశాలున్నా, స్వదేశంలో తనలాంటివారిని ఆదుకోవాలన్న సంకల్పంతో ఇండియా వచ్చి 2012లో రతన్టాటా సహకారంతో బొల్లాంట్ ఇండస్ట్రీస్ను హైదరాబాద్లో స్థాపించారు. ఈ సంస్థ ప్రస్తుత టర్నోవర్ రూ.130 కోట్లపైనే. పేపర్ ప్లేట్లు, అట్ట పెట్టెలు తదితర పర్యావరణహిత ఉత్పత్తులను తయారుచేసే ఈ సంస్థలో 200 మంది దివ్యాంగులు పనిచేస్తున్నారు. 2017లో ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన ఆసియాలో 30 ఏండ్లలోపు అత్యంత ప్రతిభావంతులైన 30 మందిలో ఒకరిగా నిలిచారు. యంగ్ గ్లోబల్ లీడర్-2021గాను ఎంపికయ్యారు.