తెలుగుయూనివర్సిటీ, మే 15: ప్రముఖ సాహిత్య విమర్శకుడు, భాషావేత్త, ఉత్తమ అధ్యాపకుడు డాక్టర్ కేకే రంగనాథాచార్యులు (80) శనివారం కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట కొవిడ్ బారినపడిన ఆయన హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రంగనాథాచార్యులుకు భార్య ఊర్మిల, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతగానో కృషిచేసిన ప్రముఖ భాషా సాహితీవేత్త, విమర్శకులు ఆచార్య కేకే రంగనాథాచార్యులు మరణంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశారు. తెలుగు భాషా పండితులుగా పలు ఉన్నత పదవులను చేపట్టిన ఆచార్యులు.. తెలుగు సాహిత్య వికాసానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఓ సాహితీ శిఖరం నేలకొరిగిందని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు. కేకే రంగనాథాచార్యులు గొప్ప తాత్వికమూర్తి, మానవతామూర్తి అని కొనియాడారు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు. రంగనాథాచార్యులు 1941లో హైదరాబాద్ సీతారాంబాగ్లో జన్మించారు. సంస్కృత పాఠశాలలో బీడీఎల్ పూర్తిచేశారు. సంస్కృత, తెలుగు భాషా సాహిత్యాల్లో, భాషా శాస్త్రంలో ఎంఏ చదివారు. 17-19 శతాబ్దాల్లో శాసనభాష అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. తొలుత నాంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1967లో నాటి ఆంధ్రసారస్వత ప్రాచ్య కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. 20 ఏండ్లపాటు అధ్యాపకుడిగా, ప్రధానాచార్యులుగా, పరిషత్తు ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఎందరో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దారు. ఆధునిక సాహిత్యంలోని వివిధ అంశాలపై దాదాపు 12 ఏండ్లపాటు సారస్వత పరిషత్తులో ప్రతినెలా సదస్సులు నిర్వహించారు. ఈ చర్చలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా, డీన్గా పనిచేసి పదవీవిరమణ చేశారు. ఉత్తమ శ్రేణి బోధకుడిగా పేరొందారు. సమైక్యవ్యాసాలు, బహుముఖం, నేటి తెలుగు, పరిచయాలు, ప్రస్థావనలు వంటి అనేక గ్రంథాలు రాశారు.
కేకే రంగనాథాచార్యులు మృతికి తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రగాఢ సంతాపం తెలిపింది. పరిషత్తు ప్రాచ్యకళాశాల ప్రధానాచార్యులుగా, పరిషత్తు కార్యదర్శిగా అందించిన సేవలు శ్లాఘనీయమని పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు.