హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్పై రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ప్రశంసల వర్షం కురిపించారు. వినాయక చవితిని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సంతోష్ కుమార్.. ఈ ఏడాది సీడ్ గణేశా విగ్రహాలను పంపిణీ చేశారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుతో పాటు పలువురు ప్రముఖులకు ఈ సీడ్ గణేశా ప్రతిమలను పంపించారు. విత్తన గణపయ్య ప్రతిమలు అద్భుతమంటూ ఎంపీ సంతోష్ కుమార్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా సంతోష్కుమార్ను రామోజీరావు ప్రశంసిస్తూ, ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు రామోజీరావు ఓ లేఖ విడుదల చేశారు.
మీరందించిన హృద్యమైన మట్టి గణపయ్య విగ్రహం మీకున్న పర్యావరణ చైతన్యానికి మరో నిదర్శనంగా నిలిచింది. గతంలో కూడా ప్రాచీన భారతీయ సాహిత్యంలో ప్రస్తుతించిన అరుదైన వృక్షజాతుల చిత్రాలతో కూడిన వృక్షవేదం పుస్తకాన్ని వెలువరించి వృక్షాలపై, పర్యావరణంపై మీకున్న మక్కువను చాటుకున్నారు. సాంప్రదాయికమైన మన పండుగల్నీ పర్యావరణానుకూల రీతుల్లో జరుపుకోవచ్చన్న సందేశం స్ఫురించేలా మట్టి గణపయ్య విగ్రహాన్ని నాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పండగ వేళ మీ ఇంటిల్లిపాదికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయురారోగ్య ఆనందాలు సదా మీ వెంట నిలవాలని కాంక్షిస్తూ..