హైదరాబాద్ : ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా గుర్తింపు దక్కడం వెనుక సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ రోజు ఎంతో చారిత్రకమైందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో రామప్ప చోటు సాధించడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అన్నారు. కాకతీయ కళానైపుణ్యానికి ప్రపంచస్థాయిలో గొప్ప గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్రానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశారని, మంత్రుల బృందాన్ని సైతం పంపి ఒత్తిడి తీసుకొచ్చారని గుర్తుచేశారు.ఇందులో తానూ భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. ములుగులోని రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం ఆయన కృషిని మరింత ఇనుమడింప చేసిందన్నారు.