వెంకటాపూర్, ఆగస్టు 2: ప్రపంచ వారసత్వ సంపదగా విశ్వఖ్యాతి పొందిన చారిత్రక రామప్ప ఆలయ ప్రత్యేకతలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. శిల్ప సౌందర్యాలు, వాటిని చెక్కిన తీరు సంభ్రమాశ్చార్యాలకు గురిచేస్తున్నాయి. అందమైన శిల్పాలుగా మారిన ఆ శిలలను ఏ గుట్టను తొలిచి తెచ్చారు? ఎక్కడ వాటిని శిల్పాలుగా మలిచారు..? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని చారిత్రక రామప్ప ఆలయ నిర్మాణానికి సమీప గుట్ట రాళ్లనే ఎక్కువగా వాడిన ఆనవాళ్లు అక్కడ ఉన్నాయి. రామప్ప ఆలయానికి రెండు రకాల రాళ్లు వినియోగించారు. ఒకటి ఇసుకరాయి. మరొకటి గ్రానైట్ (బ్లాక్ బసల్ట్). ఇసుక రాయిని చెరువు (రామప్ప గుడికి పడమర వైపు) పక్కన గుట్ట నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ రాళ్లను కట్ చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. రాళ్లను గుట్ట నుంచి వేరు చేసేందుకు అర అడుగు దూరంలో రంధ్రాలను చేసి వాటిలో వెదురుబొంగు (కర్ర)లను పెట్టి నీటితో తడపడం వల్ల ఆ కర్రలు ఉబ్బి రాళ్లు గుట్ట నుంచి వేరు అయ్యేవి. ఇలా శిల్పులు వారికి కావాల్సిన సైజులో రాళ్లను తొలచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చి శిల్పాలను మలిచి ఆలయానికి అమర్చేవారు. ఈ ఇసుకరాయిలో కూడా రెండు రకాల రంగుల రాళ్లు కనిపిస్తాయి. ఈ రాయి చూసేందుకు గరుకుగా, ముట్టుకుంటే నున్నగా అనిపిస్తుంది. గ్రానైట్ రాయిని వరంగల్, ఖమ్మం ఏరియా నుంచి తీసుకొచ్చారు. ప్రధాన ఆకర్షణ ఉన్న శిల్పాలను గ్రానైట్తో చేయగా.. ఆలయం మొత్తం ఇసుక రాళ్లతో నిర్మించారు. ప్రధాన శిల్పాలకు వరంగల్ చుట్టు పక్కల ప్రాంతాల గుట్టల నుంచి తీసుకొచ్చి శివలింగం, నంది, నాట్యమండపం, ద్వారాలకు, సాలభంజికల (మదనిక)కు, గజకేసరి విగ్రహాలకు పైదూళాలకు, నాలుగు స్తంభాలకు బ్లాక్ బసల్ట్ రాతిని వాడారు. ఈ రాళ్లతో చేసిన విగ్రహాలు కొత్తగా చేసినట్లు కనిపిస్తాయి.
శిల్పాలు చెక్కింది ఇక్కడే..
రామప్ప ఆలయ శిల్పాలను ఉత్తర వైపున ఉన్న స్థలంలో శిల్పులు చెక్కి తీసుకొచ్చి తుది మెరుగులు దిద్ది ఆలయానికి అమర్చారు. గుట్టల వద్ద నుంచి రాళ్లను ఏనుగుల సహాయంతో ఆలయం దగ్గరికి తీసుకొచ్చి వడ్రంగి పనిచేసే వాళ్లు కర్రను ఏ విధంగా రెండు కర్రలపై చెక్క పెట్టి చేస్తారో ఆ నాటి శిల్పులు కూడా అదే విధంగా రెండు రాళ్లపై రాయిని పెట్టుకొని శిల్పాలను చెక్కిన ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. రామప్ప ఆలయం పక్కన పంట పొలాల్లో ఈ రాళ్లు కనిపిస్తాయి.