హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): కాకతీయుల శిల్ప కళా వైభవానికి ప్రతిరూపంగా నిలిచిన రామప్ప ఆలయ కీర్తిప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసేందుకు యునెసో ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం తెలంగాణకు గర్వకారణం అని పేర్కొంది. యునెసో గుర్తింపుతో ప్రపంచ పటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ప్రశంసించింది. ప్రపంచ అంచనాలకు తగ్గట్టుగా ఆలయాన్ని తీర్చిదిద్దాలని ఇం దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు శాఖలు, రాష్ట్ర రెవెన్యూశాఖ అధికారులతో కమిటీ ఏర్పాటుచేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ఈ కమిటీకి కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండింగ్ ఆరియాలజిస్ట్ నోడల్ ఆఫీసర్గా వ్యవహరించాలని, ఆగస్టు 4న కమిటీ తొలి సమావేశం జరుగాలని సూచించింది.
ఈ కమిటీకి ఆయా శాఖలు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని, అందరూ సమిష్టిగా పనిచేయాలని ఆదేశించింది. కమిటీ బ్లూ ప్రింట్ రూపొందించే వరకూ దశల వారీగా స్థాయీ నివేదికలను తమకు అందజేయాలని నిర్దేశించింది. ఈ వ్యవహారం మొత్తాన్ని తాము పర్యవేక్షిస్తామని ప్రకటించింది. రామప్ప ఆలయ కీర్తిప్రతిష్టలను నిలబెట్టుకోవాలంటే యునెసో విధించిన షరతులను అమలు చేయాలంటూ ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ అంశంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ‘రామప్ప ఆలయంతోపాటు బఫర్ జోన్లో కాకతీయుల కాలం నాటి చిన్నచిన్న ఆలయా లు కొన్ని శిథిలావస్థకు చేరాయని కథనాలు వచ్చాయి. వీటిని కూడా రామప్ప ఆలయ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నించాలి. రామప్ప ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయి స్మారక చిహ్నాలు, స్థలాల మండలి (ఐకామోస్) రక్షణలోకి తీసుకోవాలంటే ఈ ఏడాది డిసెంబర్లోగా ఆ ప్రణాళికను సమర్పించాల్సి ఉంది. ఇందులో కీలకపాత్ర కేంద్ర పురావస్తు శాఖదే.
ఏకాభిప్రాయం లేకపోతే పనులు పూర్తిచేయడం కష్టమవుతుంది. భిన్నాభిప్రాయాలు లేకుండా ఉండాలనే కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండింగ్ ఆరియాలజిస్ట్ను నోడల్ ఆఫీసర్గా నియమిస్తూ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ అందరినీ కలుపుకొని విధులు నిర్వహించాలి. బ్లూప్రింట్ తయారీకి తరుచుగా సమావేశాలు నిర్వహించాలి. ఆ సమావేశాల స్థాయీ నివేదికలను హైకోర్టుకు నివేదించాలి. తొలి నివేదిక నాలుగు వారాల్లోగా సమర్పించాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.