ప్రణాళికలు రూపొందించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశం
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రామప్ప దేవాలయ సమీపంలోని చారిత్రక కట్టడాలు, ఆలయాలను సంరక్షిస్తూ కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్ను అభివృద్ధిచేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. రామప్పకు యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపద హోదా లభించిన నేపథ్యంలో శుక్రవారం ఆయన రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, హెరిటేజ్ తెలంగాణ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. యునెస్కో గైడ్లైన్స్ ప్రకారం రామప్ప చెరువు, కాల్వలకు చట్టబద్ధత కల్పించే అంశంపై 2022 డిసెంబర్ నాటికి సమర్పించాల్సిన సమగ్ర నివేదికపై చర్చించారు. ఆలయంలో కేంద్ర ఆర్కియాలజీశాఖ స్థలం సరిహద్దులను గుర్తించాలని సూచించారు. సమావేశంలో సర్వేఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ స్మిత ఎస్కుమార్, తెలంగాణ వైఏటీసీ జాయింట్ సెక్రటరీ రమేశ్, హెరిటేజ్ తెలంగాణ ఉన్నతాధికారులు నారాయణ, రాములునాయక్, నాగరాజు పాల్గొన్నారు.