హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంతోపాటు వక్ఫ్బోర్డు కూడా తమవంతుగా పేద ముస్లింలకు సహాయం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను పంపిణీచేస్తున్నట్టు బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం తెలిపారు. రూ.21 లక్షల వక్ఫ్బోర్డు నిధులతో 2,500 ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. రంజాన్ గిఫ్ట్ప్యాక్లవాహనాలను శనివారం వక్ఫ్బోర్డు కార్యాలయం వద్ద హోంమంత్రి మహమూద్అలీ, బోర్డు చైర్మన్ సలీం సంయుక్తంగా జెండాఊపి ప్రారంభించారు. కరోనా బారిన పడుతున్న పేదలను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ర్టాలకన్నా ఎంతో ముందున్నదని కొనియాడారు. కొవిడ్తో మరణిస్తున్న ముస్లింల అంత్యక్రియల నిర్వహణకు ముస్లిం గ్రేవ్యార్డ్ల నిర్వాహక కమిటీలు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కౌసర్ మొయినుద్దీన్, జాఫర్ హుస్సేన్ మెరాజ్, ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.