హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) ప్రార్థనలు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సూచించారు. రంజాన్ సందర్భంగా ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలని తెలియజేశారు. మసీదుల్లో కేవలం నలుగురు మాత్రమే ప్రార్థనలు చేయాలని తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ , జుమ్మా నమాజ్ లలో నలుగురు మాత్రమే మసీదుల్లో ప్రార్థనలు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులను , లాక్ డౌన్ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని ముస్లిం సోదరులు ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మసీదులలో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మసీదుల వెలుపల ప్రార్థనలు చేయడానికి అనుమతి లేదన్నారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలను నిర్వహించరాదన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి, నియమాలను ఖచ్చితంగా పాటించడానికి మనమందరం కలిసి పనిచేయాలని మహమూద్ అలీ పేర్కొన్నారు.