8 గంటల వరకే షాపులు, ఇతర సంస్థలు
ఈనెల 30 వరకు నిబంధనలు.. ఉల్లంఘిస్తే చర్యలే..
కరోనా నేపథ్యంలో అమల్లోకి ఉత్తర్వులు
నిర్మల్ అర్బన్/ఎదులాపురం, ఏప్రిల్ 20 : కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉండనుండగా, ఈనెల 30 వరకు అమలు చేయనున్నారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి పోలీసులు ప్రభుత్వ ఉత్తర్వులను అమలులోకి తెచ్చారు. రాత్రి 9 తర్వాత జనాలు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. మంగళవారం నుంచి 30వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పలు అత్యవసర సేవల శాఖలకు మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 8 గంటల వరకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని ఆదేశించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
అత్యవసర సర్వీసుల సేవలకు మినహాయింపు..
కరోనా ఉధృతి నేపథ్యంలో రోజూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాత్రి 8 గంటల వరకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ నుంచి పార్మసీలు, ల్యాబ్లు, మీడియా, పెట్రోల్ బంక్లు, శీతల గిడ్డంగులు, గోదాములు, అత్యవసర సర్వీసుల సేవలకు మినహాయింపు ఇచ్చింది. వైద్యం కోసం దవాఖానలకు వెళ్లే రోగులకు ఆంక్షలు సడలించింది. అంతర్రాష్ట్ర రవాణాకు అనుమతులు అవసరంలేదని స్పష్టం చేసింది. ఎలాంటి పాసులూ అవసరంలేదని తెలిపింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సర్కారు సూచిస్తున్నది.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : మంచిర్యాల ఎస్ఐ ముత్తి లింగయ్య
నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ కింద చర్యలు ఉంటాయని మంచిర్యాల పట్టణ ఎస్ఐ ముత్తి లింగయ్య హెచ్చరించారు. అత్యవసరమై బయటకు వస్తే తప్పకుండా మాస్క్ ధరించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా వ్యాపారులు, ప్రజలు ప్రభుత్వానికి, తమకు సహకరించాలని కోరారు. ప్రస్తుతం మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం చేస్తే దేశానికి సేవ చేసినట్లేనని ఆయన ఉటంకించారు.
పకడ్బందీగా అమలు చేయాలి : నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్ 20 : నైట్ కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో నంబర్ 87 ప్రకారం రాత్రి 9 నుంచి ఉద యం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ యన పేర్కొన్నారు. ప్రతిరోజూ రాత్రి కర్ఫ్యూ ఆం క్షలు అమలులో ఉంటాయన్నారు. ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో బయటకు వెళ్లేవారు సెల్ఫ్ ఐడీ కార్డు తీసుకొని రావాలన్నారు. సమస్యలుంటే 944 0900680 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, సూపరిం టెండెంట్ దేవేందర్రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా శ్రీకాంత్..
మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన అదనపు ప్రైవేట్ కార్యదర్శిగా శ్రీకాంత్ను పూర్వపు ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జిగా నియమించారు.
సహకరించాలి : ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర
ఎదులాపురం, ఏప్రిల్ 20 : నైట్ కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. పోలీస్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ అధికారులు పెట్రోలింగ్, గస్తీ ముమ్మరం చేయాలని సూచించారు. జిల్లాలో ప్రత్యేకంగా 16 పోలీస్ పెట్రోలింగ్ టీమ్లను ఏర్పాటు చేశామన్నారు. ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్, బోథ్ పట్టణాల్లో ప్రత్యేకంగా అన్ని చౌరస్తాల్లో పికెట్ ఏర్పాటు చేశామని తెలిపారు.