హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు న్యాయపరమైన నీటివాటాపై ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా కృష్ణా జలాల్లో 50:50 శాతం ఇవ్వాలని కేంద్రాన్ని, కేఆర్ఎంబీని కోరుతామని నీటి పారుదలశాఖ స్పెషల్ చీఫ్సెక్రటరీ రజత్కుమార్ తెలిపారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)ల అధికారాల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్శక్తిశాఖ ఇటీవల జారీచేసిన గెజిట్లోని సాంకేతిక, పరిపాలన, న్యాయపరమైన అంశాలపై అధికారులతో అధ్యయనం చేస్తున్నారు. నిపుణులతో కూలంకశంగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఎర్రమంజిల్లోని జలసౌధలో సోమవారంసైతం ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు, అధికారులతో రజత్కుమార్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
గెజిట్లోని అంశాలపై చర్చించారు. అంతకుముందు రజత్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు కృష్ణా జలాల్లో ట్రిబ్యునల్ న్యాయపరమైన వాటాను తేల్చాల్సి ఉన్నదని తెలిపారు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్రవాటాలోని 811 టీఎంసీలను 50ః50 నిష్పత్తిలో రెండు రాష్ర్టాలకు కేటాయించాలని కోరారు. ఈ విషయాన్ని కేంద్రం, కేఆర్ఎంబీ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లామని.. మరోసారి ఇదే ప్రతిపాదనను ముందుపెట్టే యోచనలో ఉన్నామని వివరించారు. దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి, డిండి తదితర ప్రాజెక్టులన్నీ పాతవేనని.. ఆయా పలు ప్రాజెక్టుల పనులపై పీఎం మోదీ సైతం పలు సందర్భాల్లో ప్రస్తావించారని గుర్తుచేశారు. తెలంగాణ చేపట్టిన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని తెలిపారు.