హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని సీఎం కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఈ నెల 26న జరిగే సింగరేణి బోర్డు మీటింగ్లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సీఎండీ శ్రీధర్ను ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం, కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ పదవీ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. దీంతో 43,899 మంది సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. రామగుండం నియోజకవర్గకేంద్రంలో సింగరేణి మెడికల్ కాలేజీని ఏర్పాటుచేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి. సింగరేణి ప్రాంత సమస్యలపై ఆ ప్రాంత పరిధిలోని ప్రజాప్రతినిధులతో ప్రగతిభవన్లో మంగళవారం సీఎం కేసీఆర్ సమీక్షాసమావేశం నిర్వహించారు. సింగరేణి పరిధిలో ఇండ్ల స్థలాలను కేటాయించిన సంస్థ, కలెక్టర్లకు అప్పగించిందని.. వాటిని సత్వరమే పంపిణీ చేయాలనే ఎమ్మెల్యేల అభ్యర్థనకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. దాదాపు 30 వేల మందికి లబ్ధి చేకూర్చే అంశాన్ని ఆలస్యం చేయకుండా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు.
సింగరేణి ఓపెన్కాస్ట్ ప్రాంతంలో బొగ్గుతవ్వకం, రవాణా ద్వారా పొల్యూషన్, రోడ్లు పాడవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఏర్పాటుచేసిన ‘డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్’ (డీఎంఎఫ్టీ) నిధులు ఇకమీదట కొత్త జిల్లాల వారీగానే కేటాయిస్తామని సీఎం తెలిపారు. తెలంగాణలో జిల్లాలు అంటే నోటిఫై చేసిన 33 జిల్లాలుగానే భావించాలని పేర్కొన్నారు. అదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు, ఆయా జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలకే డీఎంఎఫ్టీ నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి అగ్రగామిగా దూసుకుపోతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలో ఎకడాలేని విధంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగుల కోసం రాష్ట్రప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నదని చెప్పారు. తెలంగాణ రాకముందు రూ.12 వేల కోట్లుగా ఉన్న సింగరేణి ఆదాయం ఈ ఏడాది రూ.27 వేల కోట్లకు చేరుకోనున్నదని పేర్కొన్నారు. సొంత జాగాలున్న పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం నగదురూపంలో సాయం చేయాలని, గతంలో పేదలకు నిర్మించి ఇచ్చిన ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిస్థానంలో కొత్త ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ప్రజాప్రతినిధులు చేసిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సీఎం, ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న దళితబంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలకు చేరేలా కృషి చేయాలని కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు బాల సుమన్, రేగా కాంతారావు, దివాకర్రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, వనమా వెంకటేశ్వర్రావు, కోరుకంటి చందర్, ఆత్రం సకు, కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.