హైదరాబాద్ : రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 28 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారి రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కోసనాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం7.6 కిలోమీటర్లపైన విస్తరించి నైరుతి వైపుకు వంగి ఉంది. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా బలపడే అవకాశం ఉంది. ఇది ఒడిశా, చత్తీస్గడ్ల మీధుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. రుతుపవనాల ద్రోణి సముద్ర మట్టం వద్ద జైసల్మేర్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంతం నుంచి ఉత్తర అమమాన్ సముద్రం వరకు కొనసాగుతుందని పేర్కొన్నది.
దీని ప్రభావంతో ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం,నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.