హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమవగా, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నర్సంపేట, పరకాల డివిజన్లు, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు, కొత్తగూడెం, గంగారం మండలాల్లో వాన పడుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, టేకులపల్లి, గండాల, ఆళ్లపల్లి మండలాల్లో, ఖమ్మం జిల్లావ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది.
ఆదివారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 14.9 సెంటీమీటర్లు, కుమ్మెరలో 14.6 సెం.మీ., నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 11.4, ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 10, కరీంనగర్ జిల్లా తాడికల్లో 8.85 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.
కాగా, పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడింది. దీనిప్రభావంతో రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లండి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.