రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు..నేడు, రేపు కొనసాగే అవకాశం
నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. ఈ నెల 31న కేరళను చేరనున్నాయి. తౌటే తుఫాను, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఒక మాదిరి వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 84.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆది, సోమవారాల్లో పశ్చిమ, ఆగ్నేయ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.