వీణవంక, మార్చి 28: అతడు సాధారణ రైతుల్లా కాకుండా వినూత్నంగా ముందుకు ‘సాగు’తున్నాడు. తనకున్న ఆరెకరాల్లో మూడు రకాల పంటలు వేస్తున్నాడు. ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిగ దిగుబడులు సాధిస్తున్నాడు. అంతేకాకుండా సొంతంగా మార్కెటింగ్ చేస్తూ దండిగా లాభాలు గడిస్తున్నాడు మామిడాలపల్లికి చెందిన యువరైతు కొమ్మిడి శ్రీనివాస్రెడ్డి.
శ్రమ తక్కువ లాభాలు ఎక్కువ
తక్కువ కాలం, తక్కువ శ్రమతో అధిక లాభాలు వచ్చే పుచ్చకాయ పంటను సాగు చేసిన. 90 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. ఎకరానికి రూ.45 వేలు పెట్టుబడి పోను రూ.75 వేలు మిగులుతున్నాయి. ఇలాంటి పంటల సాగుతో నేల సారవంతమవుతుంది. సేంద్రియ విధానంలో పండించడంతో పుచ్చకాయలు రుచిగా ఉంటున్నాయి.
కొమ్మిడి శ్రీనివాస్రెడ్డి, యువరైతు, మామిడాలపల్లి, వీణవంక మండలం
వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన యువరైతు శ్రీనివాస్రెడ్డికి చిన్నప్పటి నుంచే సాగుపై మక్కువ ఎక్కువ. సేద్యంలో అనేక వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. అందరిలా కాకుండా ఆరుతడి పంటలవైపు మొగ్గు చూపుతున్నాడు. ఒక పంట తర్వాత మరో పంట చేతికి వచ్చేలా చూసుకుంటూ లాభాల బాటలో సాగుతున్నాడు. నాలుగెకరాల్లో పుచ్చకాయ షుగర్ కింగ్ వెరైటీని వేస్తున్నాడు. ఎకరన్నరలో వెద పద్ధతిలో వరిని సాగు చేస్తున్నాడు. 20 గుంటల్లో అరటిని సేద్యం చేస్తున్నాడు.
లాభాల పుచ్చ..
శ్రీనివాస్రెడ్డి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి సాధించాలనే లక్ష్యంతో పుచ్చకాయ సాగుకు శ్రీకారం చుట్టాడు. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న షుగర్ కింగ్ వెరైటీని ఎంచుకున్నాడు. సాగుకు ముందు భూమిలో సేంద్రియ ఎరువులు చల్లి ట్రాక్టర్తో కల్టివేషన్ చేశాడు. ఇందులో కేజిన్నర విత్తనాలు నాటాడు. ఎకరానికి రూ. 12 వేలు ఖర్చు చేసి మల్చింగ్ పేపర్ వేశాడు. అలాగే రూ.20 వేలు వెచ్చించి డ్రిప్ ఏర్పాటు చేశాడు. ప్రతి రోజూ ఎకరానికి నీరందిస్తుంటాడు. ఈ పంట 90 రోజుల్లో కోతకు రాగా ఎకరానికి 20 నుంచి 25 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం పంటకాలం పూర్తయి కోతకు రావడంతో పుచ్చకాయలను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ మార్కెట్లకు తరలిస్తున్నాడు. ఎకరానికి రూ.1.20 లక్షల చొప్పున ఆదాయం వస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు.